తెలుగువాళ్లమంతా కలిసే ఉందాం: బాబు, చరిత్రలో 2014: కేసీఆర్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలుగా విడిపోయినా తెలుగువారంతా కలిసే ఉందామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు బుధవారం అన్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఆయన నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
రాష్ట్రం విడిపోయినా తెలుగువారంతా కలిసిమెలిసి జీవించాలన్నదే తన ఆశయమన్నారు. కొత్త సంవత్సరంలో ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేరాలన్నారు. అందరి సహకారంతో కొత్త రాష్ట్రానికి ప్రజారాజధాని నిర్మిస్తామని, ఈ దిశగా ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించామని, స్వర్ణాంధ్ర నిర్మాణమే లక్ష్యమన్నారు.
చరిత్రలో నిలిచిపోతుంది: కేసీఆర్
2014వ సంవత్సరం తెలంగాణ చరిత్రలో నిలిచిపోతుందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అన్నారు. తెలంగాణ ప్రజలకు కేసీఆర్ కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సరంలో ప్రజల ఆకాంక్షలు, అవసరాలు తీరాలని కోరుకున్నారు.
ఎన్నో పోరాటాల తర్వాత తెలంగాణ రాష్ట్రం కల 2014లో నిజమైందని, ఇది చరిత్రలో నిలిచిపోతుందన్నారు. 2015లో ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ముందుగు సాగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కొత్త సంవత్సరంలో ప్రజలు ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో ఉండాలని గవర్నర్ నరసింహన్ ఆకాంక్షించారు.
తెలుగు ప్రజలకు జగన్ శుభాకాంక్షలు
తెలుగు ప్రజలకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు 2015 చిరస్మరణీయం కావాలని ఆకాంక్షించారు. 2015లో ప్రతి ఇంటా సుఖశాంతులు వెల్లివిరియాలని, ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రజా శ్రేయస్సు కోసం కొత్త లక్ష్యాలు నిర్దేషించుకోవాలన్నారు. ఇచ్చిన హామీలను ప్రభుత్వాలు అమలు చేయాలన్నారు.