ఢిల్లీలో హైడ్రామా: చంద్రబాబు-కేజ్రీవాల్లో ఓ కామన్ విషయం... సీఎం లేఖకు దిమ్మతిరిగే కౌంటర్!
న్యూఢిల్లీ: ఢిల్లీ రాజ్ భవన్ వద్ద నాలుగు రోజులుగా ఆందోళన చేస్తున్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను కలవనీయకపోవడంపై ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేజ్రీవాల్ నిరసనకు మమతా బెనర్జీ, పినరాయి విజయన్, కుమారస్వామి, చంద్రబాబులు మద్దతు పలికిన విషయం తెలిసిందే. వారు కేజ్రీని కలిసేందుకు ప్రయత్నించారు. ఎల్జీ నిరాకరించారు.
దీనిపై చంద్రబాబు ట్వీట్టర్లో స్పందించారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయంలో నిరసన తెలుపుతున్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను కలిసేందుకు అనుమతివ్వమని తనతో సహా నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కోరినా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ నుంచి ఎలాంటి స్పందన లేదని చంద్రబాబు శనివారం రాత్రి సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్లో పేర్కొన్నారు. ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం తన కార్యకలాపాలను సజావుగా నిర్వహించుకునేందుకు లెఫ్టినెంట్ గవర్నర్ సహకరించాలని డిమాండ్ చేశారు.
ట్విట్టర్లో వినతిపత్రం పోస్టు
అరవింద్ కేజ్రీవాల్కు తమ మద్దతు తెలిపేందుకు ఢిల్లీకి వచ్చామని చంద్రబాబు పేర్కొన్నారు. ఈఅంశాలపై వినతిపత్రం ఇవ్వాలనుకుంటున్నామని, రాత్రి 9 గంటల సమయంలో కలిసేందుకు అవకాశమివ్వాలని లెఫ్టినెంట్ గవర్నర్ను కోరినా ఫలితం లేదన్నారు. ఆయన్ను కలిసేందుకు సమయం కోరుతూ నలుగురు ముఖ్యమంత్రులు సంతకాలు చేసిన వినతిపత్రం ప్రతిని ట్విట్టర్లో పోస్టు చేశారు.
నలుగురు సీఎంలు ఒక్కచోట
చంద్రబాబు అంతకుముందు కర్ణాటక సీఎం కుమారస్వామి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, కేరళ సీఎం పినరాయి విజయన్లతో భేటీ అయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోను ఆయన పోస్ట్ చేశారు.
జీవీఎల్ కౌంటర్
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ను కలిసేందుకు చంద్రబాబు సహా నలుగురు సీఎంలు చేసిన ప్రయత్నాలపై బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నర్సింహా రావు స్పందించారు. చంద్రబాబు, కేజ్రీవాల్లకు చురకలు అంటించారు. చంద్రబాబు, కేజ్రీవాల్లలో ఓ కామన్ విషయం ఉందని, ఇద్దరు కూడా ముఖ్యమంత్రులుగా దారుణంగా విఫలమయ్యారని, తమ ఫెయిల్యూర్స్ను కప్పిపుచ్చుకునేందుకు ఇద్దరు కూడా దీక్షలు, నిరసనలు చేస్తారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు '5 స్టార్స్' (ఖరీదైన) నిరసనలతో ప్రజాధనాన్ని వ్యర్థం చేస్తున్నారన్నారు.
చంద్రబాబు వారిని ఉపయోగిస్తే, కేజ్రీవాల్ గూండాలను ఉపయోగించారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన రాజకీయ కార్యక్రమాల కోసం నాన్ గెజిటెడ్ కార్మికులను ఉపయోగించడంలో నిపుణులని, అరవింద్ కేజ్రీవాల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిపై దాడికి తన గూండాలను ఉపయోగించారని, ఇద్దరూ తప్పుగా వారి స్వార్థ ప్రయోజనాల కోసం ప్రభుత్వ అధికారులను ఉపయోగించారని జీవీఎల్ పేర్కొన్నారు.