టీటీడీ ఆభరణాల ఆరోపణలపై చంద్రబాబు కీలక ప్రకటన: ‘ఆ రూబీ విలువ రూ.50’
అమరావతి: తిరుమల శ్రీవారి ఆభరణాల విషయంలో వస్తున్న ఆరోపణలపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. ఆగమ శాస్త్రం ప్రకారమే తిరుమల కొండపై అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. సోమవారం మీడియా సమావేశంలో తిరుమల శ్రీవారి నగలకు సంబంధించి వస్తున్న ఆరోపణలపై కీలక ప్రకటన చేశారు.
ఇకపై ప్రతి రెండేళ్లకోసారి శ్రీవారి నగలపై జుడీషియల్ విచారణ చేపడతామని సీఎం ప్రకటించారు. ఆ జుడీషియల్ కమిటీ ముందే ప్రతి రెండేళ్లకోసారి నగల పరిశీలన చేస్తామన్నారు. భక్తుల మనోభావాలు దెబ్బ తినకుండా జాగ్రత్తలు తీసుకుంటామని సీఎం స్పష్టం చేశారు.
టీటీడీ విషయంలో రాజకీయాలకు తావివ్వకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నామని చంద్రబాబు తెలిపారు. కొంతమంది లేని నగలు, డైమండ్లు ఉన్నాయంటూ అసత్య ఆరోపణలు చేస్తున్నారని పరోక్షంగా రమణ దీక్షితులు ఆరోపణలపై చంద్రబాబు మండిపడ్డారు. విపక్షాలు చివరికి దేవుడిని సైతం వదిలిపెట్టడం లేదని విమర్శించారు.
రమణదీక్షితులు అసత్య ప్రచారం చేస్తున్నారు: ఆ రూబీ విలువ రూ.50
శ్రీవారి ఆభరణాల విషయంలో అసత్య ఆరోపణలు చేసిన రమణ దీక్షితులుకు ఆ భగవంతుడే గుణపాఠం చెబుతాడని టీటీడీ ఛైర్మన్ సుధాకర్ యాదవ్ అన్నారు. శ్రీవారి ఆభరణాలన్నీ భద్రంగా ఉన్నాయన్నారు. సోమవారం టీటీడీ పాలకమండలి సభ్యుల ఆధ్వర్యంలో శ్రీవారి ఆభరణాలను పరిశీలించారు. భక్తుల మనోభావాలను రమణ దీక్షితులు దెబ్బతీస్తున్నారని విమర్శించారు.
Recommended Video
భక్తులు కానుకలు విసడం వల్ల పగిలిన రూబి విలువ 50 రూపాయలుగా రికార్డులో ఉందని సుధాకర్ తెలిపారు. రమణ దీక్షితులు చేస్తున్న ఆరోపణలు నిజమైతే తిరుమలకు వచ్చి నిరూపించాలని సవాల్ విసిరారు. లేదంటే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. 1952 నుంచి కూడా టీటీడీలో ఎలాంటి ఆభరణాలు పోలేదని టీటీడీ సభ్యుడు బోండా ఉమ తెలిపారు. రమణదీక్షితులు ఆరోపణల్లో వాస్తవం లేదని అన్నారు.