తండ్రే భరించని సైకోతో నేను: జగన్పై బాబు, బతికించేది..
హైదరాబాద్: కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు శనివారం నిప్పులు చెరిగారు. చిత్తూరు జిల్లా కాంగ్రెసు నేత, మాజీమంత్రి గల్లా అరుణ కుమారి, ఆయన తనయుడు గల్లా జయదేవ్ టిడిపిలో చేరారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. గల్లా తండ్రి రాజగోపాల్ నాయుడు ప్రజల మనిషి అని, ఆయన తనను సొంతబిడ్డలా చూసుకున్నాడని చెప్పారు.
గల్లా కాంగ్రెసు పార్టీతో అనుబంధం తెంచుకొని వస్తున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చన్నారు. గల్లా కుటుంబంతో తనకు చిన్న నాటి నుండి అనుబంధముందన్నారు. అరుణ తండ్రి ప్రజల కోసమే పని చేశారన్నారు. కాంగ్రెసు నేతలు చరిత్రహీనులుగా మిగిలిపోవడం ఖాయమన్నారు. గల్లా కుటుంబాన్ని తాను పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నానని చెప్పారు. గల్లా కుటుంబం ఎప్పుడు ప్రజాసేవలోనే ఉందన్నారు.
విభజన విషయంలో కాంగ్రెసు పార్టీ ఇష్టారీతిగా వ్యవహరించిందన్నారు. తరతరాలుగా కాంగ్రెసు పార్టీలో ఉన్న వారు టిడిపిలోకి వస్తున్నారని చెప్పారు. తెలంగాణ పునర్ నిర్మాణం, సీమాంధ్ర అభివృద్ధి టిడిపితోనే సాధ్యమన్నారు. విభజన విషయంలో ఇరు ప్రాంతాల వారిని కూర్చోబెట్టి సమస్య పరిష్కరించాలంటే సోనియా పట్టించుకోలేదని ఆరోపించారు. కాంగ్రెసు పార్టీ ఇప్పుడు తాను తీసుకున్న గోతిలో తానే పడిందన్నారు.
తెలంగాణ కోరుకున్న వాళ్లు కూడా సీమాంధ్రకు అన్యాయం జరగాలని చూడలేదన్నారు. ఇటలీ గణతంత్ర దినోత్సవం జూన్ 2న తెలంగాణ అపాయింటెడ్ డే ఇచ్చారని విమర్శించారు. కాంగ్రెసు కుట్ర రాజకీయాలపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారన్నారు. కాంగ్రెసు పార్టీని సిమెంట్ కాంక్రీటుతో పూడ్చి పెట్టాలన్నారు. తెలంగాణలో టిడిపి చరిత్ర సృష్టించబోతుందని, సీమాంధ్రలో గెలుపు తథ్యమని అన్నారు.
జగన్ పైన నిప్పులు
వైయస్ జగన్ను ఆయన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డే భరించలేకపోయారని చంద్రబాబు నిప్పులు చెరిగారు. తండ్రి భరించలేని సైకోతో మనం పోరాడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ విలువల గురించి మాట్లాడితే సిగ్గేస్తోందన్నారు. జగన్ది నవతరం కాదని దోపిడీతరమన్నారు.
ఇడుపులపాయ ముడుపులపాయగా మారిందని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో నాలుగు సీట్లు వస్తే కేసుల మాఫీ కోసం ఆ సీట్లను తాకట్టు పెడతామని జగన్ చూస్తున్నారన్నారు. తండ్రి భరించని సైకోతో మనం పోరాడాల్సి రావడం విచారకరమన్నారు. వైయస్ ఆయనను భరించలేక బెంగళూరు పంపించారన్నారు.
బతికించేది బాబునే: గల్లా అరుణ
ఐసియులో ఉన్న ఆంధ్రప్రదేశ్ను బతికించేది చంద్రబాబు మాత్రమేనని గల్లా అరుణ కుమారి, గల్లా జయదేవ్ అన్నారు. నాడు రాజధానిని తాము త్యాగం చేస్తే, నేడు హైదరాబాద్ వదిలి వెళ్లమంటున్నారని మండిపడ్డారు. విపత్కర పరిస్థితుల్లో రాష్ట్రాన్ని బాబు నిలబెట్టగలరన్నారు. ప్రజాసేవ చేసే అవకాశమిచ్చిన చంద్రబాబుకు థ్యాంక్స్ అని జయదేవ్ అన్నారు.