జగన్ పార్టీ సభ్యులు బండబూతులు తిట్టారు: చంద్రబాబు
హైదరాబాద్: అసెంబ్లీలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యుల తీరు పైన ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం నాడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సభలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు చాలా వల్గర్గా ప్రవర్తించారని ధ్వజమెత్తారు.
అసెంబ్లీలో గొడవ చేయడం ఏమిటన్నారు. మేం ఐదు కోట్ల మంది ప్రజల కోసం పని చేస్తున్నామని, వీరి కోసమే (వైసిపి) పని చేయడం లేదన్నారు. పోలవరం ప్రాజెక్టు వద్దంటున్నారని, పట్టిసీమ ప్రాజెక్టు వద్దని చెబుతారని మండిపడ్డారు.
అసెంబ్లీ ప్రజాస్వామ్యయుతంగా నడవాలన్నారు. ప్రజలు నాకు ఎందుకు ఓటేశారని ప్రశ్నించారు. తన పైన నమ్మకంతో, కష్టకాలంలో ఏపీని నడిపిస్తారని ఓటేశారన్నారు. వైసిపిస్పీకర్ స్థాయిని దిగజార్చేలా ప్రవర్తించిందని ధ్వజమెత్తారు.
అసెంబ్లీలో వైసీపీ సభ్యులు బండ బూతులు తిట్టారని, సభ హుందాతనం పోవద్దనే తాము భరిస్తున్నామని ఆయన అన్నారు. రాష్ట్రానికి ఏం కావాలో ఆనాడు వైసీపీ అడగలేదని, సమైక్యాంధ్ర ముసుగులో అప్పుడు గొడవ చేశారని చంద్రబాబు ఆరోపించారు. ఏపీకి సంబంధించి కేంద్రమంత్రి ప్రకటన ఇచ్చినప్పుడు దానిపై చర్చ జరగాల్సి ఉందని అన్నారు.
గురువారం శాసన మండలిలో చాలా స్పష్టంగా చెప్పానని, తాను ప్రకటన ఇచ్చిన తర్వాత చర్చ జరపాలని కోరానని బాబు అన్నారు. చెప్పేది వినకుండా గొడవ చేశారని ఆయన ఆరోపించారు. మంచి సభ్యుల మధ్య చెడు నాయకుడు ఉంటే ఆ సభ్యులు కూడా తప్పుదారి పట్టే పరిస్థితి ఉందని అన్నారు. సభ్యులు చర్చ జరిపితే సమాధానం చెప్పడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చంద్రబాబు స్పష్టం చేశారు.
మల్లయుద్ధాలు చేస్తాం...కొట్టుకుంటాం అనడం సరికాదని ఆయన హితవు పలికారు. అసెంబ్లీ ఉన్నది కొట్టుకోడానికి కాదని, ప్రజా సమస్యలు చర్చించడానికని ఆయన శుక్రవారం మీడియా సమావేశంలో అన్నారు.
అసెంబ్లీలో ప్రతిపక్ష తీరు గర్హనీయమన్నారు. కేంద్ర ప్రకటన పైన చర్చ జరగాలన్నారు. తెలుగుదేశం పార్టీ సభ్యులు ఎప్పుడు కూడా అదుపు తప్పలేదన్నారు. అసెంబ్లీ ఉన్నది కొట్టుకోవడానికి కాదన్నారు. వాయిదా తీర్మానం ఇచ్చిన వైసిపి సభ్యులు సభలో లేరని మండిపడ్డారు.
తాను ఏపీ ప్రయోజనాల కోసం చిత్తశుద్ధితో పని చేస్తున్నానని చెప్పారు. అందుకే తాము అధికారంలోకి రాగానే పోలవరం ప్రాజెక్టును తీసుకు వచ్చేలా చేశామన్నారు. పోలవరం ప్రాజెక్టు కోసం ఏడు మండలాలను ఇవ్వకుంటే తాను ప్రమాణ స్వీకారం చేయనని చెప్పానన్నారు.