'అమ్మ' తరహా: అమరావతిలో తొలి అన్న క్యాంటీన్, టిఫిన్పై డైలమా
అమరావతి: ఏపీలో అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసే దిశగా చంద్రబాబు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. రాజధాని అమరావతిలో వీటిని ప్రయోగాత్మకంగా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. తమిళనాడులో జనాదరణ పొందిన 'అమ్మ క్యాంటీన్ల' తరహాలో 'అన్న క్యాంటీన్లు' ఏర్పాటు చేయాలని ప్రభుత్వం రెండేళ్ల క్రితం నిర్ణయించింది.
మంత్రులు తమిళనాడుకు వెళ్లి అన్న క్యాంటీన్ల పని తీరును పరిశీలించారు. వారి సూచనల మేరకు ఇప్పుడు గుంటూరు జిల్లా వెలగపూడిలో అన్న క్యాంటీన్ను మరో వారం పదిరోజుల్లో ఏర్పాటు చేయనున్నారు. ఏపీలో ఇది తొలి అన్న క్యాంటీన్ కానుంది.
క్యాంటీన్ కాంట్రాక్టులు ఎవరికి అప్పగించాలి? అనే విషయమై చర్చించేందుకు మంత్రివర్గ ఉపసంఘం మంగళవారం నాడు సమావేశం కానుంది. అదే సమయంలో, భోజనంతో పాటు టిఫిన్ కూడా పెట్టాలా అనే విషయమై కూడా చర్చించనున్నారు.
తమిళనాడులో అమ్మ క్యాంటీన్లను చూసి వచ్చారు. వీటిని మనకు తగినట్లు మార్పు చేసి అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేయనున్నారు. తొలిదశలో భోజనాన్ని, ఆ తర్వాత టిఫిన్ అందించాలనే ప్రతిపాదనతో పాటు, అసలు రెండూ ఒకేసారి ప్రారంభించాలనే మరో ప్రతిపాదన కూడా ఉంది.