చంద్రబాబు ఓ హై టెన్షన్ వైర్ .. ముట్టుకుంటే బూడిదే అంటున్న టీడీపీ ఎమ్మెల్సీ
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీలో తన మార్క్ పాలన కొనసాగించే ప్రయత్నం చేస్తున్నారు. విద్యుత్ ఒప్పందాలపై జగన్ పునః సమీక్ష చేస్తున్నారు. ఈ నిర్ణయమే తప్పని కేంద్రం చాలా మొదట సున్నితంగా అక్షింతలు వేసినా, తరువాత రెండోసారి గట్టిగా చెప్పినా కూడా కేంద్రం మాట కూడా వినకుండా జగన్ నిర్ణయం తీసుకున్నారు. సీతయ్య ఎవరి మాట వినడు అన్న చందంగా జగన్ పని చేస్తున్నారు. అంతే కాదు ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఏపీ మాజీ సీఎం చంద్రబాబు హయాంలో కుదుర్చుకున్న పీపీఏలలోను, పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలోనూ అవినీతి జరిగిందని అసెంబ్లీ వేదికగా చెప్పి టీడీపీ అవినీతి బయట పెడతామని హెచ్చరిస్తున్నారు . దీంతో శాసన సభా సమావేశాలు రచ్చగా మారుతున్నాయి.
దొంగకు ఊరందరూ దొంగలే ... బుద్దాను వదలని కేశినేని నానీ
టీడీపీ అవినీతి చేసిందంటున్న వైసీపీ .. తిప్పికోడుతున్న టీడీపీ
గత ఐదేళ్లలో నాటి రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాలపై సమీక్షించి తీరుతామని, రాష్ట్ర ఆర్థిక రంగాన్ని దెబ్బతీస్తున్న అన్ని అంశాలపైనా సమీక్షించి, అక్రమాలు ఉంటే తప్పకుండా చర్యలు తీసుకుంటామని జగన్ సర్కార్ పదేపదే చెప్తోంది. ఇక టీడీపీ హయాంలో అవినీతి జరిగిందని వైసీపీ నేతలు కూడా ఆరోపణలు గుప్పిస్తున్నారు . ఈ ఆరోపణలను టీడీపీ నేతలు తిప్పికొడుతున్నారు. ఈ క్రమంలో జరిగిన ఓ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ ఎమ్మెల్సీ బాబూ రాజేంద్ర ప్రసాద్ చంద్రబాబు నాయుడి పాలనలో , టీడీపీ హయాంలో ఎలాంటి అవినీతి జరగలేదని , కావాలనే వైసీపీ రాద్దాంతం చేస్తుందని చెప్పుకొచ్చారు.
చంద్రబాబునాయుడు హైటెన్షన్ వైర్ లాంటి వ్యక్తి .. పట్టుకుంటే షాక్ కొట్టి బూడిదైపోతారన్న ఎమ్మెల్సీ బాబు రాజేంద్రప్రసాద్
చంద్రబాబునాయుడు హైటెన్షన్ వైర్ లాంటి వ్యక్తి అని, ఆయన్ని పట్టుకోవాలని ఎవరైనా ప్రయత్నిస్తే షాక్ కొట్టి బూడిదైపోతారని టీడీపీ ఎమ్మెల్సీ బాబూ రాజేంద్ర ప్రసాద్ అన్నారు. టీడీపీ హయాంలో కుదుర్చుకున్న పీపీఏల్లో ఎలాంటి అవకతవకలు లేవనే విషయాన్ని తమను వ్యతిరేకించే బీజేపీ ప్రభుత్వమే స్పష్టం చేసిందని పేర్కొన్న ఆయన ఇంత కన్నా ఇంకేమి నిదర్శనం కావాలని ప్రశ్నించారు. వైసీపీ కేవలం కక్ష పూరిత చర్యల్లో భాగంగానే ఇలాంటి ఆరోపణలు చేస్తూ విచారణకు ఆదేశిస్తుందని ఆయన పేర్కొన్నారు.
మేం నిప్పు.. చెయ్యం ఏ తప్పు .. చేస్తే నిరూపించండి అంటూ సవాల్ విసిరిన ఎమ్మెల్సీ బాబు రాజేంద్రప్రసాద్
చంద్రబాబు హయాంలో ఏపీకి నాలుగు వేల ఐదు వందల పరిశ్రమలు వచ్చాయని, తద్వారా సుమారు ఐదు లక్షల పదహారు వేల మందికి ఉపాధి లభించిందని సాక్షాత్తూ జగన్ ప్రభుత్వమే చెప్పిందని ఆయన అన్నారు. ప్రభుత్వం చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలే విభేదించడం విడ్డూరంగా ఉందని ఆయన పేర్కొన్నారు .మేము నిప్పులాంటి వాళ్లం. మా చంద్రబాబునాయుడుగారు, తెలుగుదేశం ప్రభుత్వం, అప్పటి మా మంత్రులు ఏ తప్పూ చేయలేదు. ఒకవేళ చేస్తే..నిరూపించండి అని వైసీపీ నేతలకు బాబూ రాజేంద్ర ప్రసాద్ సవాల్ విసిరారు. మొత్తానికి చంద్రబాబు హై టెన్షన్ వైర్ అని , ముట్టుకుంటే బూడిదే అని చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారో మరి .