ఎన్నికలకు ముందు చంద్రబాబు కీలక నిర్ణయం, వారికి షాకిస్తారా?
అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు త్వరలో కేబినెట్ విస్తరణ చేయనున్నారా? అంటే కావొచ్చుననే వాదనలు వినిపిస్తున్నాయి. ముందస్తు ఎన్నికలు చ్చినా రాకున్నా.. సాధారణ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత కీలక నిర్ణయం తీసుకోనున్నారని తెలుస్తోంది.
Recommended Video
'నిజాలు తెలుస్తున్నాయనే ఒత్తిడిలో.. కన్నాపై దాడి వెనుక బాబు, పవన్పైనా'
ఎన్నికలకు ముందు మంత్రివర్గాన్ని విస్తరించి, అందరి ఆదరణ పొందాలనే యోచనలో ఉన్నారని తెలుస్తోంది. ప్రస్తుతం చంద్రబాబు కేబినెట్లో ఒక్క మైనార్టీ మంత్రి కూడా లేరు. దీనిపై ప్రతిపక్ష వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చాలా రోజులుగా విమర్శలు గుప్పిస్తోంది. వచ్చే ఎన్నికలు లక్ష్యంగా కేబినెట్ విస్తరణ ఉంటుందని చెబుతున్నారు.
టీడీపీ శ్రేణుల్లో జోరుగా చర్చ
కేబినెట్లో మైనార్టీలు లేని లోటును చంద్రబాబు ఇప్పుడు భర్తీ చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ముస్లిం, మైనార్టీలతో పాటు బలహీనవర్గాలకు తన కేబినెట్లో చోటు కట్టబెట్టనున్నారనే ప్రచారం సాగుతోంది. ఇదే విషయం తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో చర్చ సాగుతోందని అంటున్నారు. సాధ్యమైనంత త్వరలో మంత్రివర్గ విస్తరణ చేయనున్నారని అంటున్నారు.
కేబినెట్ విస్తరణకు కారణం ఇదీ!
చాలాకాలంగా పార్టీని అంటిపెట్టుకొని ఉన్న వారికి మంత్రి పదవులు కట్టబెట్టనున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఎన్నికలకు మరో ఏడాది కూడా లేదు. అయినప్పటికీ కేబినెట్ విస్తరణ అంశం తెరపైకి రావడం వెనుక సామాజిక సమీకరణాలు, వచ్చే ఎన్నికల్లో ఓట్ల లబ్ధియే కారణమనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
బీజేపీ వెళ్లిపోవడంతో ఖాళీలు
గత కొంతకాలంగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో కేంద్రం నుంచి టీడీపీ, ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం నుంచి బీజేపీ బయటకు వచ్చింది. దీంతో అప్పటి వరకు మంత్రులుగా ఉన్న బీజేపీ ఎమ్మెల్యేలు కామినేని శ్రీనివాస్, మాణిక్యాల రావులు తమ మంత్రి పదవులకు రాజీనామా చేశారు. వారి స్థానాలను భర్తీ చేయనున్నారు. మైనార్టీ, ఎస్టీ నేతలతో భర్తీ చేసే అవకాశాలను చంద్రబాబు పరిశీలిస్తున్నారని తెలుస్తోంది.
కొందరి మంత్రుల భవితవ్యం కూడా తేలిపోనుందా?
ఖాళీగా ఉన్న మంత్రి పదవులను భర్తీ చేసి వివిధ వర్గాలను సంతృప్తి పరచడమే చంద్రబాబు ఉద్దేశ్యంగా భావిస్తున్నారు. ఎన్నికలకు ముందు ఇది కీలక నిర్ణయం కానుందని అంటున్నారు. మరోవైపు, ఒకరిద్దరిని కేబినెట్ నుంచి పంపించే అవకాశాలు కూడా కొట్టి పారేయలేమనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. మంత్రి అఖిలప్రియ వంటి వారి పట్ల చంద్రబాబు గత కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నారని, ఆమె భవితవ్యం కూడా తేలిపోనుందని అంటున్నారు. అలాగే, సామాజిక కోణంలోను కొందరిని తొలగించి, మరికొందరిని తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు. ఇప్పుడున్న వారిని కదిలిస్తే ఇబ్బందులు వస్తాయని భావిస్తే బీజేపీతో ఖాళీ అయిన రెండు స్థానాలను మాత్రమే పూర్తి చేస్తారు. అందులో ఒకరికి మైనార్టీలకు దక్కుతుంది. అప్పుడు పశ్చిమ గోదావరి, అనంతపురం జిల్లాలకు చెందిన షరీఫ్, ఫారూక్లు రేసులో ఉన్నారు. వైసీపీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు జలీల్ ఖాన్, చాంద్ భాషాలను కేబినెట్లోకి తీసుకోవడం సరికాదని చంద్రబాబు భావిస్తున్నారు. మరొకటి ఎస్టీ, క్షత్రియులలో ఒకరికి దక్కే అవకాశముంది.