చంద్రబాబు, లోకేశ్ మానసిక రోగులు, పీక పట్టుకొమ్మని కుమారుడికి చెప్తున్నారా:జోగి రమేశ్
మార్షల్స్పై చంద్రబాబు, లోకేశ్ ప్రవర్తన సరికాదని మంత్రి కన్నబాబు, వైసీపీ నేత జోగి రమేశ్ అన్నారు. మన భద్రత కోసం విధులు నిర్వర్తిస్తున్న వారి గొంతు పట్టుకోవడం ఏంటీ అని ప్రశ్నించారు. చంద్రబాబు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సభా సాంప్రదయాలను పాటించి, సభ గౌరవం పెంచాల్సిన అవసరం ఉందన్నారు.
దాడి సరికాదు..
24 గంటలపాటు నేతలను కంటికి రెప్పాలా కాపాడే మార్షల్స్పై దాడి సరికాదని జోగి రమేశ్ అన్నారు. నిన్న చంద్రబాబు నాయుడు, లోకేశ్ బాబు మానసిక రోగులుగా ప్రవర్తించారని మండిపడ్డారు. 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు తన కుమారుడికి ఏం నేర్పిస్తున్నారని ప్రశ్నించారు. 70 ఏళ్ల వయస్సులో.. నిండు సభలో అధికారులపై దాడుల చేయమని ప్రోత్సహిస్తున్నారా అని అడిగారు.
ఇదా మీ పద్ధతి
లోకేశ్ మార్షల్ గొంతు పట్టుకుంటే చంద్రబాబు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. లోకేశ్ను చంద్రబాబు ఎందుకు వారించలేదని ప్రశ్నించారు. మందలించకుండా ఎందుకు మిన్నకుండిపోయారని అడిగారు. అంటే మార్షల్స్పై దాడి చంద్రబాబు ప్రోత్సహిస్తున్నారా అని నిలదీశారు. 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు చర్యను చూసి ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారని చెప్పారు.
అన్నదమ్ములే కదా..
మార్షల్స్ పోలీసులే కదా అని జోగి రమేశ్ గుర్తుచేశారు. వారు అంటే ఎందుకు చిన్నచూపు అని అడిగారు. మన అన్నదమ్ములు లాంటి వారిపై ఎందుకు నీచంగా ప్రవర్తించారని ప్రశ్నించారు. మార్షల్స్ పాకిస్థాన్లో జన్మించారా..? లేదా ఉగ్రవాదులా అని అడిగారు. నేతల భద్రత కోసం అహార్నిసలు శ్రమిస్తోన్న వారిని చులకనభావంతో మాట్లాడటం, దాడులు చేయడం సరికాదన్నారు. సభకు వెంటనే చంద్రబాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
లోకేశ్ వద్దు మరీ వైఎస్ఆర్...
సీనియర్ నేతగా చంద్రబాబు లోకేశ్కు ఏం నేర్పిస్తున్నారని మంత్రి కన్నబాబు అడిగారు. మార్షల్స్ను ఎలా కొట్టాలి, గేట్లు ఎలా తోయాలి అని శిక్షణ ఇస్తున్నారా అని ప్రశ్నించారు. సభలో లేని వారి గురించి మాట్లాడాలని చెబుతారు.. మరీ వారు వైఎస్ఆర్ గురించి ఎందుకు ప్రస్తావిస్తున్నారు అని అడిగారు. చంద్రబాబు నాయుడు ఉద్యోగుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో అప్పటి ఎమ్మెల్యేలు రోజా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని సస్పెండ్ చేశారని గుర్తుచేశారు.