కేంద్ర పథకాల్లో చంద్రబాబు రూ.43 వేల కోట్ల దోపిడి...సిబిఐకి ఫిర్యాదు:సోమువీర్రాజు సంచలనం
రాజమండ్రి: బిజెపి ఎమ్మెల్సీ సోమూ వీర్రాజు మరోసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై సంచలన ఆరోపణలు చేశారు. చంద్రబాబు అవినీతికి కేంద్ర పథకాలు వనరులుగా మరాయని సోమూ వీర్రాజు ఆరోపించారు.
గృహ నిర్మాణాల పథకంలో చంద్రబాబు రూ.30వేల కోట్లు దోచేస్తున్నారని సోమూ వీర్రాజు తెలిపారు. ఉపాధి హామీ పథకంలో రూ.13వేల కోట్లు ఇప్పటికే దోచుకున్నారని చెప్పారు. గృహ నిర్మాణం, ఉపాధి హామీ పథకాల్లో అవినీతిపై తానే సిబిఐకి ఫిర్యాదు చేస్తానని సోమువీర్రాజు తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశానికే అత్యంత ప్రమాదకర రీతిలో చంద్రబాబు అవినీతిపాలన సాగుతుందని సోము వీర్రాజు దుయ్యబట్టారు.
టిడిపి మట్టిని , ఇసుకను, వేలకోట్లరూపాయాల్లో దోచేసిందని ఆరోపించారు వీర్రాజు. దీనిపై అనేకసార్లు ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసినా పట్టించుకున్న పాపానికి పోలేదని విమర్శించారు. ఇక ఈ దుష్ట పాలనపై ప్రజా తిరుగుబాటు చేయాలిసిన తరుణం ఆసన్నమైందన్నారు. చంద్రబాబులో కాంగ్రెస్ రక్తం పెట్టుకొని, పచ్చచొక్కా వేసుకున్నారని విమర్శించారు. పోలవరానికి చంద్రబాబుకు అసలు సంబంధంలేదని బిజెపి నేత సోము వీర్రాజు అన్నారు.
కాంగ్రెస్ పార్టీలో పుట్టిపెరిగి ఆ రక్తం ప్రవహించే బాబు... కుర్చీకోసం ఎన్టీఆర్ కాళ్ళు పట్టుకు లాగేసిన రోజు ఆయనకు దండ వేసి దణ్ణం పెట్టడం విచిత్రమని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మోడీ సాయం లేకుండా చంద్రబాబు జీరో అన్నది పచ్చి వాస్తవమని పేర్కొన్నారు. రాష్ట్రానికి ప్రధాని ఎన్నో చేశారని చిన్న అంశాలు పెద్దవి చేసి బీజేపీని బద్నాం చేస్తున్నారని సోము ఆరోపించారు.