మోడీని కలిసిన జెపి: మోడీ పిలిచి మరీ పక్కనే బాబు
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ తొలిసారి మంగళవారంనాడు వేదికను పంచుకున్నారు. మహబూబ్నగర్లో జరిగిన ప్రచార సభలో ఇరువురు నాయకులు పాల్గొన్నారు. పైగా, నరేంద్ర మోడీ చంద్రబాబును చేయి పట్టుకుని తన పక్కన కూర్చోబెట్టుకున్నారు.
సభ ప్రారంభంలో చంద్రబాబు మోడీని శాలువా కప్పి సన్మానించారు. ఆ తర్వాత ఆయన పక్కకు వెళ్లిపోతుండగా, మోడీ చంద్రబాబు చేయి పట్టుకుని తీసుకెళ్లి తన పక్కన కూర్చోబెట్టుకున్నారు. మోడీకి మరో పక్కన మహబూబ్నగర్ బిజెపి లోకసభ అభ్యర్థి నాగం జనార్దన్ రెడ్డి కూర్చున్నారు. చంద్రబాబుకు మరో పక్కన బిజెపి తెలంగాణ అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి కూర్చున్నారు.
చంద్రబాబు మహబూబ్నగర్ సభలో క్లుప్తంగా మాట్లాడారు. ప్రధాని కాకుండా మోడీని ఎవరూ ఆపలేరని ఆయన చెప్పారు. తెలంగాణలో టిడిపి, బిజెపి కూటమి విజయం సాధిస్తుందని అన్నారు. మోడీ, చంద్రబాబు సభకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. నిజామాబాద్ సభలో నరేంద్రమోడీతో కలిసి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు.
ఇదిలావుంటే, హైదరాబాదులోని బేగంపేట విమానాశ్రయంలో నరేంద్ర మోడీని లోకసత్తా నేత, మల్కాజిగిరి లోకసభ అభ్యర్థి జయప్రకాష్ నారాయణ కలుసుకున్నారు. తనకు మల్కాజిగిరిలో మద్దతు ఇవ్వాలని జెపి కోరుతున్నారు. కాగా, తెలుగుదేశం మాత్రం జెపిపై మల్లారెడ్డిని పోటీకి దింపింది. పవన్ కళ్యాణ్ మల్కాజిగిరిలో జెపికి మద్దతుగా ప్రచారం చేయనున్నారు.
నరేంద్రమోడీకి తమ పార్టీ మద్దతు ఇస్తోందని జెపి అన్నారు. ఉద్యోగాలు ఇచ్చే సత్తా మోడీకే ఉందని ఆన అన్నారు. మోడీని కలిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు.