బాబుకు ఆగస్టు సంక్షోభం, బయటపడేసే వ్యక్తి పవన్ ఒక్కరే: జోగయ్య
ఏలూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఆగస్టు సంక్షోభం తప్పదని మాజీ పార్లమెంటు సభ్యుడు చేగొండి హరిరామ జోగయ్య జోస్యం చెప్పారు. తెలుగుదేశం పార్టీకి యేటా ఆగస్టు సంక్షోభం ఎదురవుతుందనే నమ్మకం ఒకటి రాజకీయాల్లో ఉంది. దాన్ని ఆసరా చేసుకుని హరిరామ జోగయ్య ఆ వ్యాఖ్య చేశారు.
కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం చేస్తున్న ఆమరణ నిరాహార దీక్ష విషయంలో చంద్రబాబు అనవసరమైన పట్టుదలకు పోతున్నారని, అలా పోతే చంద్రబాబుకు మరో ఆగస్టు సంక్షోభం తప్పదని ఆయన అన్నారు. ఆగస్టు సంక్షోభం తలెత్తితే చంద్రబాబు ప్రభుత్వ మనుగడకు ప్రమాదం వాటిల్లుతుందని ఆయన మంగళవారం అన్నారు.
వైద్య నిపుణుల నివేదికలను బట్టి చూస్తే ముద్రగడ ఆరోగ్య పరిస్థితి ఎటు దారి తీస్తుందో అనే ఆందోళన నెలకొందని అన్నారు. ముద్రగడ పద్మనాభం మొండివైఖరి, పట్టుదల గల వ్యక్తి అని ఆయన అన్నారు. ఈ సమస్యను పరిష్కరించడం అంత సులువైనదిగా భావించలేమని అభిప్రాయపడ్డారు.
సమస్యనకు పరిష్కారం కనుక్కోగల ఒకే ఒక వ్యక్తి పవన్ కల్యాణ్ అని ఆయన అన్నారు. చంద్రబాబుకు మిత్రపక్షంవాడిగా, ముద్రగడ మనస్తత్వాన్ని అర్థం చేసుకోగల వ్యక్తిగా పవన్ కల్యాణ్ ఒక్కరే దీన్ని పరిష్కరించగలరని అన్నారు. ప్రజలందరి తరఫున పవన్ కల్యాణ్ రంగంలోకి దిగి సమస్యను పరిష్కరించాలని ఆయన కోరారు.