చంద్రబాబు శుభవార్త: పీజీ చేస్తే రూ.2 వేలు, డిసెంబర్ నుండి నిరుద్యోగభృతి?
ఎన్నికల్లో ఇచ్చిన హమీ మేరకు నిరుద్యోగులకు నిరుద్యోగభృతి ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం సన్నాహలు చేస్తోంది. 2017 డిసెంబర్ నుండి నిరుద్యోగులకు నిరుద్యోగభృతి ఇచ్చేందుకు సర్కార్ ఏర్పాట్లు చేస్తోంది.
విజయవాడ: ఎన్నికల్లో ఇచ్చిన హమీ మేరకు నిరుద్యోగులకు నిరుద్యోగభృతి ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం సన్నాహలు చేస్తోంది. 2017 డిసెంబర్ నుండి నిరుద్యోగులకు నిరుద్యోగభృతి ఇచ్చేందుకు సర్కార్ ఏర్పాట్లు చేస్తోంది.
2014 ఎన్నికల సమయంలో టిడిపి తన ఎన్నికల మ్యానిఫెస్టోలో నిరుద్యోగులకు నిరుద్యోగభృతి ఇస్తామని హమీ ఇచ్చింది. అయితే ఈ హమీని ఇంకా అమలు చేయడం లేదని వైసీపీ తీవ్రంగా విమర్శలు గుప్పిస్తోంది.
అయితే ఇటీవలనే నిరుద్యోగభృతి చెల్లింపు అంశంపై రాష్ట్ర ప్రభుత్వం సన్నాహలు చేసింది. ఏ స్థాయి వారికి ఎంతెంత భృతి ఇవ్వాలనే విషయమై ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం.
ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హమీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని టిడిపి చెబుతోంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడ నిరుద్యోగభృతి చెల్లింపుకు ఆలస్యమైందనే అభిప్రాయాలు కొందరు టిడిపి నేతలు వ్యక్తం చేస్తున్నారు.
డిసెంబర్ నుండి నిరుద్యోగభృతి చెల్లింపు
2017 డిసెంబర్ నుండి ఏపీ రాష్ట్రంలోని నిరుద్యోగులకు నిరుద్యోగభృతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎంత మంది నిరుద్యోగులున్నారు. ప్రతి నెల ఎవరెవరికి ఎంత మొత్తంలో భృతి కింద చెల్లించాలనే విషయమై ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చిందని సమాచారం. నిరుద్యోగభృతి చెల్లింపు కారణంగా రాష్ట్ర ఖజానాపై ఎంతభారం పడనుందనే విషయాలపై కూడ సర్కార్ లెక్కలు తీసింది. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ప్రభుత్వానికి భారమైనప్పటికీ ఎన్నికల్లో ఇచ్చిన హమీని నిలుపుకొనేందుకు సర్కార్ నిరుద్యోగభృతి చెల్లించాలని నిర్ణయం తీసుకొందని సమాచారం.
పీజీ చదువుకొన్నవారికి నెలకు రూ. 2 వేలు
పీజీ చేసి ఉద్యోగం లేకుండా ఉన్నవారికి ప్రతి నెల రూ. 2 వేలను నిరుద్యోగభృతి కింద చెల్లించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం. అంతేకాదు గ్రాడ్యుయేట్లకు రూ.1500, ఇంటర్ చదువుకున్న వారికి రూ.1000 చొప్పున ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించిందని తెలుస్తోంది. 18 నుంచి 40 ఏళ్ల వయస్సు మధ్య వారికే భృతి ఇచ్చే అవకాశం ఉందని ప్రభుత్వవర్గాలు చెబుతున్నాయి.
ఉద్యోగం కోసం శిక్షణ
ఉన్నత చదువుకొన్నప్పటీకీ ఉద్యోగాలు లేని అభ్యర్థులకు శిక్షణ ఇప్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో నిరుద్యోగులకు ఉపాధి లభించేలా ఈ శిక్షణ ఇప్పించనున్నారు. శిక్షణ పూర్తై ఉపాధి లభించేవరకు నిరుద్యోగభృతిని ఇచ్చే అవకాశం ఉందని సమాచారం.అయితే నిరుద్యోగులకు భృతిని ఇచ్చే విషయమై ఇంకా విధివిధానాలు పూర్తి కాలేదు. విధివిధానాలకు ప్రభుత్వం ఆమోదముద్ర వేస్తే వెంటనే అమలు చేయాలని సర్కార్ భావిస్తోంది.
నిరుద్యోగుల సంఖ్యపై ప్రభుత్వం ఆరా
రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది నిరుద్యోగులున్నారనే విషయమై ఏపీ ప్రభుత్వం సమాచారాన్ని సేకరించింది. జిల్లాల వారీగా ఈ సమాచారాన్ని క్రోడీకరించింది. రాష్ట్ర వ్యాప్తంగా 12 లక్షల మంది నిరుద్యోగు లు ఉన్నారు. అయితే సెప్టెంబరు నెలాఖరు వరకు 73,538 మంది కొత్తగా తమ పేర్లను ఉపాధి కల్పన కార్యాలయాల్లో నమోదు చేసుకొన్నారు. వారిలో పోస్ట్గ్రాడ్యుయేట్లు 20 శాతం, గ్రాడ్యుయేట్లు 50 నుంచి 60 శాతం, ఇంటర్ వారు 20 శాతం మంది ఉన్నట్లు అంచనా. మహిళా నిరుద్యోగులు 23,621 మంది నమోదయ్యారు. వారిలో కూడా 20 శాతం మంది పీజీలు ఉండవచ్చని అంచనా.