డేట్ కుదిరింది: ఈనెల 25న మోడీతో చంద్రబాబు భేటీ, ఏమేమి అడుగుతారంటే..?
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడీతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈనెల 25న భేటీ కానున్నారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ కోసం కీలక భేటీగా పరిగణిస్తున్న ఈ సమావేశం గురువారం జరగాల్సి ఉంది. అయితే అనివార్య కారణాల వల్ల ప్రధాన మంత్రిత్వ కార్యాలయం (పీఎంఓ) ఈ భేటీని వాయిదా వేసింది.
తదుపరి భేటీకి ఈనెల 25 లేదా 28, 29, 31వ తేదీల్లో ఏదో ఒక రోజు ఢిల్లీకి రావచ్చని ప్రధానమంత్రి కార్యాలయం ఏపీ సీఎం కార్యాలయానికి సమాచారమిచ్చింది. ప్రత్యేకహోదాపై ఇప్పటికే సీఎం చంద్రబాబుపై ఒత్తిడి పెరుగుతండటంతో ఇప్పటికే బాగా ఆలస్యమైపోతోందని భావించిన చంద్రబాబు ఈనెల 25నే ఎంచుకున్నట్లు తెలుస్తోంది.
ప్రధాని భేటీ సమయంలో ప్రత్యేక హోదాపై కేంద్రాన్ని ఎలాగైనా ఒప్పించాలన్న లక్ష్యంతో చంద్రబాబు అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకున్నారు. బీహార్ తరహా ప్యాకేజీ కాకుండా ఉత్తరాఖండ్ తరహా ప్రత్యేక హోదా, ప్యాకేజీపై పట్టుబట్టేందుకు సిద్ధమయ్యారు. ఏపీ ఆర్థిక శాఖ అధికారులు ప్యాకేజీ ముసాయిదాలను కూడా సిద్ధం చేశారు.
ఏపీ సీఎం చంద్రబాబు ప్రధాని మోడీని అమరావతిలో భవనాల నిర్మాణం కోసం ఈ ఏడాదికి రూ.4వేల కోట్ల ప్యాకేజీ అడగాలని భావించినట్లుగా తెలుస్తోంది. రేపటి భేటీలో చంద్రబాబు ఈ మొత్తం అడగాలనుకున్నారు. రాజధాని అమరావతిలో కార్యాలయాల నిర్మాణానికి చంద్రబాబు ఫండ్స్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇందులో భాగంగా ప్రధానిని ఆ మొత్తం అడగాలనుకున్నట్లుగా తెలుస్తోంది. అక్టోబర్ 22వ తేదీన అమరావతి రాజధాని నిర్మాణానికి పునాది రాయి వేయనున్నారు. గత ఏడాది కేంద్రం రూ.1500 కోట్లను రాజధానిలో నిర్మాణాల కోసం ఇచ్చింది. ప్రధానితో ప్రత్యేకంగా సమావేశం కానున్న చంద్రబాబు... హోదా, ప్యాకేజీ ఎందుకు అవసరమో పేర్కొంటూ సమగ్ర నివేదికను తయారు చేయించారని సమాచారం.
వచ్చే ఐదేళ్లలో ప్రత్యేక హోదా రూపంలో రూ.25 వేల కోట్లు, ప్యాకేజీ కింద మరో రూ.1.25 లక్షల కోట్లు... మొత్తం రూ.1.5 లక్షల కోట్లు రాష్ట్రానికి ఇవ్వాలని ఆయన కోరనున్నట్టు తెలుస్తోంది. విభజన చట్టంలోని అంశాలు, అప్పట్లో ప్రధాని మన్మోహన్ సింగ్ ఇచ్చిన హామీలు, విభజన అనంతరం ఏపీలో కనిష్ఠ స్థాయికి పడిపోయిన హ్యూమన్ డెవలప్మెంట్ సూచికలు తదితరాలను గణిస్తూ ఉన్నతాధికారులు రిపోర్టును తయారు చేశారు.
అయితే ఇప్పటికే డిజిటల్ ఆంధ్రప్రదేశ్కు రూ.10వేల కోట్ల మేరకు కేటాయించాలని కేంద్రం నిర్ణయించింది. 11 విద్యా సంస్థల ఏర్పాటుకు ఇచ్చే నిధులు, పెట్రోకెమికల్ ప్రాజెక్టుల ఏర్పాటు, రైల్వేజోన్, కొత్త విమానాశ్రయాలు, సాగరమాల, రాజధాని నిర్మాణం కోసం ఇచ్చే నిధులన్నిటినీ ప్రత్యేక ప్యాకేజీలో చేర్చితే ఏపీకి భారీ నష్టం జరుగుతుందని ఏపీ అధికారులు భావిస్తున్నారు.
విశాఖపట్నం సమీపంలోని పూడిమడక వద్ద ఎన్టీపీసీ 4 వేల మెగావాట్ల విద్యుత్ ప్లాంట్కు రూ.25వేల కోట్లు, కృష్ణపట్నం వద్ద డీఏపీ ప్లాంట్, కొత్త బెర్త్ల నిర్మాణానికి రూ.600 కోట్లు, వైజాగ్లో పెట్రోలియం రిఫైనరీకి రూ.16 వేల కోట్లను కేంద్రం ఇప్పటికే ప్రకటించింది. ఇవన్నీ కేంద్రం ప్రకటించే ప్యాకేజీలో లేకుండా చూడాలని ఏపీ అధికారులు భావిస్తున్నారు.
దీంతోనే చంద్రబాబు ప్రధానిని కలవనున్నారు. బీహారుకు రూ. 1.65 లక్షల కోట్ల ప్యాకేజీలను ప్రకటించిన నేపథ్యంలో అంతే స్థాయిలో ఏపీకి కూడా అవకాశాలు దగ్గర చేయాలని చంద్రబాబు కోరే అవకాశాలున్నాయి. రాష్ట్రం వెనుకబడి వున్న పౌష్టికాహారం, అక్షరాస్యత, పారిశుద్ధ్యం, వయోజన విద్య తదితర రంగాల్లో పుంజుకునేందుకు ఏడాదికి రూ.10 వేల కోట్ల చొప్పున ఐదేళ్ల పాటు రూ.50 వేల కోట్లివ్వాలని బాబు కోరనున్నారని తెలుస్తోంది.