చంద్రబాబు టార్గెట్, 17 సీట్ల కోసం టీడీపీ పట్టు: కాంగ్రెస్కు కొత్త చిక్కులు తెచ్చిన టీఆర్ఎస్
Recommended Video
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గురువారం విజయవాడలో తెలంగాణ టీడీపీ నేతలతో భేటీ కానున్నారు. మహాకూటమి సర్దుబాటు దాదాపుగా కొలిక్కి వచ్చింది. పార్టీ అభ్యర్థుల ఎంపికపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. టీడీపీ పోటీ చేసే స్థానాల్లో అభ్యర్థుల నియామకం, స్థానిక పరిస్థితులపై చంద్రబాబు వారికి వివరించనున్నారు.
బాబూ! పిచ్చివేషాలేస్తే సంగతి చూస్తాం, కేసీఆర్ దెబ్బకు ఏపీకి, రికార్డులు తీస్తాం: హరీష్ కీలకవ్యాఖ్యలు
అభ్యర్థితో పాటు వారి సామాజిక వర్గాల ప్రాతిపదికన ఇప్పటికే ఓ జాబితాను రూపొందించారు. దానిని అధినేత ముందు ఉంచనున్నారు. తెలంగాణ మేనిఫెస్టోలోని అంశాలను ఆయనకు చెప్పనున్నారు. ఒకటి రెండు రోజుల్లో అభ్యర్థులను ప్రకటించనున్నారు. రెండు మూడు స్థానాలు మినహా పోటీ చేసే స్థానాలు, అభ్యర్థులు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది.
సీట్ల కోసం తెలుగుదేశం పట్టు
మహాకూటమిలో ఇబ్బందులు మళ్లీ మొదటికి వచ్చాయి. నిన్నటి వరకు తెలుగుదేశం పార్టీ సీట్ల విషయంలో పెద్దగా పట్టుబట్టింది లేదు. పద్నాలుగు, పదిహేను సీట్లకు కూడా సర్దుకుపోవాలని భావించారు. అయితే తెలంగాణ జన సమితి ప్రభావమో మరేదో కానీ టీడీపీ 17 సీట్ల కోసం పట్టుబడుతోంది. తమకు 14 కాదని, 17 సీట్లు ఇవ్వాల్సిందేనని టీడీపీ నేతలు ఈ రోజు చంద్రబాబుకు చెప్పి, ఆ తర్వాత కాంగ్రెస్ దృష్టికి తీసుకెళ్లనున్నారు.
టీడీపీ ఉనికిలో లేదని చెప్పారు కానీ
సీమాంధ్రులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో తమకు పట్టు ఉంటుందని తెలుగుదేశం పార్టీ నేతలు చెబుతున్నారు. కాబట్టి హైదరాబాద్తో పాటు పలు ప్రాంతాల్లో కలిపి తమకు 17 సీట్లు కావాలని డమాండ్ చేయనున్నారు. తెలంగాణలో టీడీపీ ఉనికిలో లేదని తెరాస నేతలు, ఇప్పుడు మా గురించే ఎక్కువగా మాట్లాడుతున్నారని టీడీపీ నేత రావుల చంద్రశేఖర రెడ్డి అంటున్నారు. మమ్మల్ని ఎదుర్కోవాలనేసరికి తెరాస నేతలకు చెమటలు పడుతున్నాయన్నారు. నాలుగు పార్టీలు కలిసేటప్పుడు టిక్కెట్ల ఖరారులో జాప్యం జరగడం సహజమని చెప్పారు.
టీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలు.. టీడీపీ టిక్కెట్ డిమాండ్
టీఆర్ఎస్ నేతలు తమ ప్రచారంలో ఎక్కువగా చంద్రబాబు నాయుడును టార్గెట్ చేస్తున్నారు. ఇప్పుడు దీని ఆధారంగానే టీడీపీ నేతలు కాంగ్రెస్ను ఎక్కువ సీట్లు డిమాండ్ చేస్తున్నారు. టీడీపీకి గట్టి పట్టు ఉన్నందునే తెరాస నేతలు చంద్రబాబును, టీడీపీని టార్గెట్ చేస్తున్నారని, కాబట్టి తమకు సీట్లు పెంచాల్సిందేనని వారు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు తెలంగాణ జన సమితి 11 సీట్ల వరకు పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సీపీఐ కూడా ఎక్కువ సీట్లు డిమాండ్ చేస్తోంది. బలం లేని సీపీఐ, కొత్త పార్టీ తెలంగాణ జన సమితి అన్ని సీట్లలో పోటీ చేస్తుంటే తాము డిమాండ్ చేయకపోవడం ఏమిటనే ఆలోచన తెలంగాణ టీడీపీకి వచ్చి ఉంటుంది. ఇది మరో కారణం కావొచ్చు.
కాంగ్రెస్ సీట్లు దాదాపు ఖరారు
ఇదిలా ఉండగా కాంగ్రెస్ పార్టీ వార్ రూంలో స్క్రీనింగ్ కమిటీ సమావేశం రెండు రోజుల పాటు వరుసగా దాదాపు 14 గంటలు, 4 గంటల పాటు జరిగింది. కాంగ్రెస్ పార్టీ పోటీ చేసే స్థానాల్లో ఒకరి కంటే ఎక్కువగా పోటీ ఉన్న 15 నియోజకవర్గాలు మినహా మిగతా చోట్ల అభ్యర్థుల ఖరారు ప్రక్రియను పూర్తి చేశారు. మరో పదిహేను స్థానాల్లో తేలాల్సి ఉంది. సోనియా గాంధీతో భేటీలో తుది నిర్ణయం తీసుకోనున్నారు.