అదే చివరి రోజు, భయపడాలి: దాచేపల్లి బాధితురాలికి బాబు గార్డియన్, నీచమంటూ జగన్ పార్టీపై ఫైర్
గుంటూరు: దాచేపల్లి ఘటన బాధాకరమని, చెప్పడానికి సిగ్గుపడే ఘటన అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ ఘటన విషయం తెలిసినప్పుడు తాను చాలా బాధ పడ్డానని తెలిపారు. ఇది నీచమైన, అమానవీయమని అన్నారు.
గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధిత బాలికను చంద్రబాబు నాయుడు శనివారం ఉదయం పరామర్శించారు. బాధిత బాలిక తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతమని అన్నారు. ఘటన జరిగిన వెంటనే నిందితుడ్ని పట్టుకుని, కఠినంగా శిక్షించాలని ఆదేశించినట్లు తెలిపారు.
అయితే, ఆ తర్వాత నిందితుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని తెలిసిందని చెప్పారు. ప్రజలు ఘటనపై వెంటనే స్పందించారని, ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రతిఘటించాలని చంద్రబాబు అన్నారు.
అదే చివరి రోజు
దాచేపల్లి ఘటన తనను ఎంతో కలచివేసిందని, ఇలాంటి ఘటనలు రాష్ట్రంలో జరగడానికి వీల్లేదని అన్నారు. ఇలాంటి ఘటనలకు పాల్పడిన వారికి అదే చివరి రోజు అని చంద్రబాబు తేల్చి చెప్పారు. మనిషిలో మానసిక పరివర్తన రావాలని, భయం ఉండాలని అన్నారు. నేరాలకు పాల్పడాలంటే భయపడేలా శిక్షలు అమలు చేస్తామని చంద్రబాబు చెప్పారు.
ఆడబిడ్డకు రక్షణగా..
సోమవారం సాయంత్రం సంఘీభావ ర్యాలీ నిర్వహిస్తామని, ‘ఆడ బిడ్డకు రక్షణగా కదులుదాం' అనే కార్యక్రమం చేపడుతున్నామని చంద్రబాబు చెప్పారు. ఈ కార్యక్రమాల్లో ప్రజలు, పార్టీల నేతలు, ప్రజాప్రతినిధులు, మీడియావారు పాల్గొనాలని కోరారు. ప్రజలు, యువతలో విచ్చలవిడితనం పనికిరాదని, సమాజంలో అంబోతుల్లా తిరిగేవారిని కట్టడి చేయాలని అన్నారు. తల్లిదండ్రులు, టీచర్లు పిల్లలకు రక్షణగా నిలవాలని అన్నారు.
ఉరిశిక్షే
ఎయిడ్స్పై అవగాహన లేని రోజుల్లో తాను బోల్డ్గా ఆరోజు ఎయిడ్స్ గురించి మాట్లాడి చైతన్యం తీసుకొచ్చినట్లు చెప్పారు. అత్యాచార ఘటనలపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని, అత్యాచారాలకు పాల్పడిన వారికి ఉరిశిక్ష తప్ప మరో మార్గం లేదని స్పష్టం చేశారు. భవిష్యత్లో ఇలాంటి ఘటనలు జరగకుండా చోటు చేసుకోకూడదని చంద్రబాబు అన్నారు.
రాజకీయం చేస్తారా? వైసీపీపై ఆగ్రహం
ఇలాంటి ఘటనలపై కూడా రాజకీయాలు చేయడం నీచమని, దుర్మార్గమని చంద్రబాబు అన్నారు. ఇలాంటి ఘటనలపైనా రాజకీయం చేస్తారా అని మండిపడ్డారు. చేతనైతే సహకరించి ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని అన్నారు. బురదలో ఉండి తమపై విమర్శలు చేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాచేపల్లి ఘటనలో విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు దుర్మార్గంగా వ్యవహరించారని మండిపడ్డారు. ఫ్లెక్సీలు పెట్టి, రెచ్చగొట్టేలా వ్యవహరించారని అన్నారు.
బాధితురాలికి గార్డియన్గా నేనుంటా: బాబు
దాచేపల్లి బాధితురాలి కుటుంబాన్ని ఆదుకుంటామని చంద్రబాబు తెలిపారు. ఇప్పటికే రూ.5లక్షల ప్రకటించామని, మరో రూ. 5లక్షలు బాధిత బాలిక పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తామని చెప్పారు. 2ఎకరాల భూమి ఇస్తామని, బాధితురాలి తండ్రికి ఉద్యోగం కల్పిస్తామని చెప్పారు. బాలికను తన సొంత ఖర్చులతో చదివిస్తానని అన్నారు. ఆమె సంరక్షణ బాధ్యత తనదేనని చంద్రబాబు చెప్పారు. మంచి స్కూలులో పాపను చేర్పించాలని ఇప్పటికే కలెక్టర్కు చెప్పానని తెలిపారు. బాలిక తన ఆశయాలను చేరుకునే వరకు అండగా ఉంటానని చంద్రబాబు చెప్పారు.
లాయర్లు వాదించొద్దు
తప్పు చేయాలంటే భయం ఉండాలని, అలాంటి శిక్షలు విధిస్తామని చంద్రబాబు అన్నారు. సమాజంలోని ఒక్కొక్కరికి ఒక్కో పోలీసును పెట్టలేమని అన్నారు. అత్యాచారాలకు పాల్పడితే నిర్భయ, పోక్సో కేసులు పెట్టి ఉరితీయాలన్నారు. నీచమైన నేరాలకు పాల్పడిన నిందితుల తరపున న్యాయవాదులు ఎవరూ కూడా వాదించొద్దని చంద్రబాబు కోరారు.
తప్పుగా సాంకేతికత
పెరిగిన సాంకేతికత కొంతమంది తప్పుగా వినియోగించి, తప్పుడు పనులకు పాల్పడుతున్నారని అన్నారు. బ్లూ ఫిల్మ్స్, పోర్న్ చిత్రాలపై నియంత్రణ చర్యలు తీసుకురావాల్సి ఉందన్నారు. సాంకేతికతను మంచికే ఉపయోగించాలని కోరారు. విశాఖ ఘటనలో ఓ అమ్మాయి అత్యాచారం జరిగిందని అబద్ధం చెప్పిందని, ఇలాంటి ఘటన వల్ల కఠిన చర్యలు తీసుకోలేకపోతున్నామని అన్నారు. దాచేపల్లి ఘటన తర్వాత నిందితులను కఠినంగా శిక్షించాలని భావించినట్లు చంద్రబాబు తెలిపారు.