కేసీఆర్కు లేఖ రాసినా..: గవర్నర్ జోక్యం కోరిన బాబు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య నెలకొన్న ఫీజు రీయింబర్సుమెంట్స్ అంశం పైన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మంగళవారం గవర్నర్ నరసింహన్ను కలిసి జోక్యం చేసుకోవాలని కోరారు. ఎంసెట్ అడ్మిషన్ల ప్రక్రియ పూర్తికి అక్టోబర్ ఆఖరుదాకా గడువు ఇవ్వాలని తెలంగాణ సర్కారు సుప్రీంకోర్టును ఆశ్రయించడం... జాప్యం జరిగితే విద్యార్థులు, కాలేజీలకు నష్టం, కష్టమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాదిస్తున్న సంగతి తెలిసిందే.
రాష్ట్ర విభజన చట్టం ప్రకారం పదేళ్లపాటు ఇరు రాష్ట్రాల్లో ఉన్నత విద్యాసంస్థల్లో అడ్మిషన్ల ప్రక్రియ ఉమ్మడిగా నిర్వహించాల్సి ఉంది. రెండు రాష్ట్రాల సమన్వయంతోనే ఇంజనీరింగ్, మెడిసిన్ అడ్మిషన్ల ప్రక్రియ మొదలవుతుంది. ఇప్పటికే విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్పై ఇరురాష్ట్రాల మధ్య తీవ్ర వివాదం నెలకొంది. అదే క్రమంలో అడ్మిషన్ల వివాదం కూడా తెరపైకి వచ్చింది. వెంటనే కౌన్సెలింగ్ తేదీలు ఖరారు చేయాలంటూ చంద్రబాబు ఇటీవల తెలంగాణ సీఎం కేసీఆర్కు లేఖ కూడా రాశారు.
ఇప్పుడు ఆయన ఇదే అంశంపై ఇరు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ను కలిశారు. ఎంసెట్ అడ్మిషన్ల ప్రక్రియలో నెలకొన్న అనిశ్చితిపై తెలంగాణ ప్రభుత్వంతో మాట్లాడతానని గవర్నర్ నరసింహన్ చంద్రబాబుకు హామీ ఇచ్చారు. మంగళవారం చంద్రబాబుతోపాటు ఆ రాష్ట్ర మంత్రులు గంటా శ్రీనివాస రావు, కామినేని శ్రీనివాస్లతో కలిసి రాజ్భవన్లో గవర్నర్ను కలిశారు.
అడ్మిషన్లకు అక్టోబరు నెలాఖరుదాకా గడువు కోరుతూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ చేసిన విషయాన్ని గవర్నర్ దృష్టికి తెచ్చారు. కౌన్సెలింగ్ ఆలస్యం కావడం వల్ల విద్యార్థులు నష్టపోతారని తెలిపారు. కళాశాలలకు కూడా నష్టం జరుగుతుందన్నారు. మెరిట్ విద్యార్థులు ఇతర రాష్ట్రాలకు వలసవెళ్లే పరిస్థితి నెలకొందని తెలిపారు. ఇలా ఒక్కసారి అడ్మిషన్ల ప్రక్రియ ఆలస్యానికి అనుమతి ఇస్తే... భవిష్యత్తులోనూ ఇదే పునరావృతమయ్యే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు.
కౌన్సెలింగ్ నిర్వహణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి అడ్డంకులు, సాంకేతిక ఇబ్బందులు లేవని.. తాము అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నామని నరసింహన్తో చెప్పారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం కేటగిరీ-బీలో ఎన్ఆర్ఐ కోటా సీట్లను 5శాతం నుంచి 15 శాతానికి పెంచాలని నిర్ణయం తీసుకుని, ఆ విషయాన్ని తెలంగాణ ప్రభుత్వానికి సమ్మతి కోసం పంపించామని తెలిపారు.
అడ్మిషన్ల నిర్వహణకు సంబంధించి ఇప్పటికే తెలంగాణ సీఎం కేసీఆర్కు లేఖ రాశానని, అయినా అటునుంచి ఎలాంటి స్పందన రాలేదని చంద్రబాబు చెప్పారు. మెరిట్ విద్యార్థులు తమ భవిష్యత్తుపై ఆందోళనతో ఉన్నారని తెలిపారు. నరసింహన్తో చంద్రబాబు, మంత్రులు దాదాపు అరగంటపాటు సమావేశమయ్యారు. అనంతరం చంద్రబాబు ఒక్కరే ఏకాంతంగా గవర్నరుతో కొద్దిసేపు మాట్లాడారు.
రీఇంబర్స్మెంట్ తేలగానే కౌన్సెలింగ్ షెడ్యూలు
ఫీజు రీయింబర్స్మెంట్పై జీవో విడుదల అనంతరం ఇంజనీరింగ్ అడ్మిషన్ల కౌన్సెలింగ్ షెడ్యూల్ను కూడా ఖరారు చేస్తామని తెలంగాణ విద్యాశాఖ మంత్రి జగదీశ్ రెడ్డి తెలిపారు. ఫీజు రీయింబర్స్మెంట్ విధి విధానాలు, విద్యార్థుల స్థానికత తదితర అంశాలపై బుధవారంనాటి కేబినెట్ భేటీలో తెలంగాణ సర్కారు నిర్ణయం తీసుకునే అవకాశముంది.