తమ్మూడూ నేనున్నా: సోదరుడు రామ్మూర్తికి ధైర్యం చెప్పిన చంద్రబాబు
చిత్తూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. శుక్రవారం తిరుపతిలో శ్రీ వేంకటేశ్వర ఇన్ స్టిట్యూట్ ఆఫ్ కేన్సర్ కేర్ అండ్ అడ్వాన్స్ రీసెర్చ్ సెంటర్ కు సీఎం చంద్రబాబు, రతన్ టాటాతో కలిసి శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే.
శనివారం తిరుపతి సమీపంలోని చెర్లోపల్లిలోని తన తమ్ముడు రామ్మూర్తి నాయుడి ఇంటికి వెళ్లారు. అధికారులను బయటే ఉండమని చెప్పిన చంద్రబాబు ఇంట్లోకి వెళ్లి తమ్ముడు రామ్మూర్తి నాయుడితో పాటు ఆయన కుమారుడు, సినీ హీరో నారా రోహిత్తో మాట్లాడారు.
ఈ సందర్భంగా తమ్ముడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు చంద్రబాబు. ఇంటికి పెద్ద దిక్కుగా తాను ఉన్నాననీ, భయపడవద్దని చంద్రబాబు తమ్ముడికి ధైర్యం చెప్పారు.
దాదాపు 20 నిమిషాల సేపు చంద్రబాబు కుటుంబ సభ్యులతో గడిపారు. అనంతరం బయటికొచ్చిన సీఎం.. చుట్టుపక్కల వారితో కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా పలువురు స్థానికులు విజ్ఞప్తి చేయడంతో చంద్రబాబు వారితో సెల్ఫీలు దిగారు. ఆ తర్వాత అందర్నీ పలకరించిన చంద్రబాబు.. అక్కడ్నుంచి బయల్దేరారు.