ఢిల్లీలో బాబు బిజీ, ఎపి పరిస్థితి ఇదీ: ప్రత్యేకహోదాపై జైట్లీ
న్యూఢిల్లీ: తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, కాబోయే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీని కలిసి సీమాంధ్ర ఆర్థిక పరిస్థితులను వివరించారు. విభజన బిల్లులో ప్రస్తావించిన అన్ని అంశాలను వెంటనే పూర్తి చేయాలని జైట్లీని బాబు కోరారు. ఆంధ్రప్రదేశ్కు ఇచ్చిన రాయితీలపై స్పష్టత ఇవ్వాలని ఆయన జైట్లీని కోరారు. చట్టంలో పొందుపరిచిన అన్ని అంశాలను అమలు చేస్తామని జైట్లీ చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి తాము సహకరిస్తామన్నారు. ఉత్తరాఖండ్ తరహా ప్యాకేజీ ఇవ్వాలని చంద్రబాబు కోరారు. సీమాంధ్రకు ప్రత్యేక హోదా పైన ప్రణాళిక సంఘం ప్రత్యేక దృష్టి సారించిందని అరుణ్ జైట్లీ చెప్పారు. ఎపి పునర్ నిర్మాణానికి సహకరిస్తామని చెప్పారు. జైరాంతో చంద్రబాబు భేటీలో కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేష్ పాల్గొన్నారు. సీమాంధ్రలో లోటు బడ్జెట్ దృష్ట్యా జీతభత్యాలకు ఆర్థిక సాయం విడుదల చేయాలని జైట్లీని చంద్రబాబు కోరారు.
కాగా, సీమాంధ్ర లోటు బడ్జెట్తో పాటు రుణ మాఫీ అంశాలను తెలియజేశారు. 13, 14 ఫైనాన్స్ కమిషన్లలో కూడా సీమాంధ్రకు పెద్దపీట వేయాలని కోరారు. యూపిఏ హయాంలో సీమాంధ్రకు తీరని అన్యాయం జరిగిందని, ఎన్డీయే హయాంలో ఆ లోటును పూడ్చాల్సిన అవసరం ఉందని జైట్లీకి విన్నవించారు.
ఉమాభారతితో చంద్రబాబు భేటీ
చంద్రబాబు కేంద్రమంత్రి ఉమా భారతితో భేటీ అయ్యారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీని ప్రకటించాలని కోరారు. కృష్ణా, గోదావరి, తుంగభద్ర అథారిటీలని ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కు అత్యధికంగా కేంద్రం నుండి రాబట్టేందుకు చంద్రబాబు ఢిల్లీలో బిజీబిజీగా మారారు.