టార్గెట్ బీజేపీ: జాతీయ నేతలతో చంద్రబాబు, మరోసారి కీలకంగా మారుతున్నారా?
బెంగళూరు: బీజేపీకి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు వివిధ ప్రాంతీయ పార్టీలను ఏకం చేసే ప్రయత్నాలను ముమ్మరం చేశారు. కుమారస్వామి ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొనేందుకు బెంగళూరుకు చంద్రబాబు వెళ్లిన విషయం తెలిసిందే.
బెంగళూరుకు చేరుకున్న చంద్రబాబుకు అక్కడి తెలుగువారు ఘనస్వాగతం పలికారు. తన పిలుపు మేరకు ఇక్కడ బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేసిన తెలుగువారికి కృతజ్ఞతలు ఆయన తెలిపారు.
బీజేపీకి వ్యతిరేకంగా..
ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న బీజేపీకి వ్యతిరేకంగా వివిధ ప్రాంతీయ పార్టీలను ఏకం చేసేందుకు ఈ బెంగళూరు పర్యటన అవకాశంగా మలచుకోవాలని చంద్రబాబు భావించారు. ఇందులో భాగంగానే ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన కోసం బీజేపీయేతర పక్షాలను ఇందుకు అనుకూలంగా మద్దతు కోరారు.
జాతీయ స్థాయిలో మరోసారి..
ఎన్డీఏ నుంచి బయటకు వచ్చాక తొలిసారిగా మాయావతి, మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్తో చంద్రబాబు బెంగళూరులో భేటి అయ్యారు. వీరితో విడివిడిగా భేటి అయిన ఆయన.. ప్రాంతీయ పార్టీల బలోపేతంపై ఈ భేటీలో చర్చించినట్లు సమాచారం. బీజేపీని లక్ష్యంగా చేసుకోవడంతోపాటు మరోసారి జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు కీలకంగా వ్యవహించాలనుకుంటున్నట్లు తెలుస్తోంది.
బీజేపీ కుట్ర రాజకీయాలు
ఏపీలో పరిణామాలు, బీజేపీ కుట్ర రాజకీయాలను ఆయా నేతల దృష్టికి తీసుకెళ్లినట్లు పార్టీ నేతల తెలుస్తోంది. తమ తమ రాష్ట్రాల్లోని పరిస్థితులను ఆయా నేతలు చంద్రబాబుకు వివరించారు. ప్రాంతీయ పార్టీలన్నీ బలోపేతం కావాల్సిన అవసరం ఉందని మమతాబెనర్జీ బాబుతో అన్నట్లు సమాచారం. జాతీయ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీల పాత్ర పెరగాలన్నారు.
జాతీయస్థాయిలో త్వరలో కీలక భేటీ..
కర్ణాటక పరిణామాలే ఇందుకు నాంది కావాలని నేతలు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. బీజేపీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో కూటమి అవసరం ఉందని మాయావతి ప్రస్తావించినట్లు సమచారం. జాతీయ స్థాయిలో ఓ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవాలనే అంశం నేతల భేటీల్లో ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. ఢిల్లీలో జరిగే ఈ సమావేశానికి తేదీ ఖరారు చేయాల్సి ఉంది.
అందరి లక్ష్యం బీజేపీ
కేంద్ర, రాష్ట్రాల మధ్య సంబంధాలు దెబ్బతినేలా బీజేపీ వ్యవహారం ఉందని పలువురు నేతలు అభిప్రాయపడినట్లు తెలిసింది. సమాఖ్య స్ఫూర్తి దెబ్బతినేలా నరేంద్ర మోడీ వ్యవహరిస్తున్నారని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యానించినట్లు సమాచారం. కాగా, బీజేపీ ఓటమే లక్ష్యంగా పనిచేయాలని సీతారాం ఏచూరి పిలుపునిచ్చారు. కొన్ని సమస్యలున్నా వచ్చే ఎన్నికల్లో సర్దుకుపోవాలని అన్నారు. బీజేపీ దూకుడుకు అడ్డుకట్ట వేయాలంటే అన్ని పార్టీలు కలిసి ముందుకు సాగాలని చంద్రబాబు సూచించినట్లు తెలిసింది.