గవర్నర్ కోర్టులో కోడెల మృతి వివాదం.. చంద్రబాబు సరికొత్త వ్యూహం.. టార్గెట్ ఎవరంటే
ఏపీ మాజీ సీఎం, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కోడెల మృతితో పాటు, టిడిపి నేతలపై పెడుతున్న అక్రమ కేసులు గురించి ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను కలిసి ఫిర్యాదు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, ఆ పార్టీ నేతలు విజయవాడలోని రాజ్ భవన్ లో గవర్నర్ ను కలిసి ఏపీలో నెలకొన్న పరిస్థితులపై ఆయనతో మాట్లాడారు. అధికారి వైసిపి రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో పూర్తిగా విఫలమైందని ఫిర్యాదు చేశారు.
అంతేకాదు అక్రమ కేసులు బనాయిస్తూ తెలుగుదేశం పార్టీ శ్రేణులను భయబ్రాంతులకు గురి చేస్తుందని గవర్నర్ కు విన్నవించారు.ఈ సందర్భంగా 13 పేజీల నివేదికను అందజేసిన చంద్రబాబు గవర్నర్ తో కోడెల ఆత్మహత్యకు గల కారణాలను వివరించారు. టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు నారా లోకేష్, నిమ్మకాయల చినరాజప్ప, దేవినేని ఉమా, బుద్ధ వెంకన్న, కరణం బలరాం, అశోక్ బాబు, కళా వెంకట్రావు, నిమ్మల రామానాయుడు, నక్కా ఆనందబాబు, వర్ల రామయ్య, ఎలమంచిలి రాజేంద్రప్రసాద్ తదితరులు గవర్నర్ ను కలిసి రాష్ట్రంలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని ఆయనకు విన్నవించారు.
ప్రజాస్వామ్యాన్ని భయపెట్టే విధంగా ప్రభుత్వ చర్యలు ఉంటున్నాయని పేర్కొన్న టిడిపి బృందం, అధికార యంత్రాంగం సైతం చట్టాలను ఉల్లంఘిస్తున్నారని పేర్కొన్నారు. కింది స్థాయి ఉద్యోగి నుండి డిజిపి వరకు చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారని గవర్నర్ కు ఫిర్యాదు చేశారు చంద్రబాబు. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ పై పద్దెనిమిది అక్రమ కేసులు బనాయించారని, ఇక తెలుగుదేశం పార్టీ నేతలను సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, అచ్చె న్నాయుడు,గంటా శ్రీనివాసరావు వంటి నేతలపై కూడా కేసులు పెట్టి వేధిస్తున్నారని వారు గవర్నర్ కు విన్నవించారు. కోడెల ఆత్మహత్యకు రాజకీయ వేధింపులే కారణాలని పేర్కొన్నవారు పలుమార్లు డీజీపీకి ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయిందని పేర్కొన్నారు. ఇప్పటికి డీజీపీకి పలుమార్లు విజ్ఞప్తి చేశామని, అయినా లాభం లేదన్న టిడిపి నేతల బృందం గవర్నర్ చొరవ తీసుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని విజ్ఞప్తి చేశారు.