'చంద్రబాబు ఫోటో మార్ఫింగ్ చేసి కమ్మ కులస్థుల మనోభావం దెబ్బతీశారు'
విజయవాడ: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఫొటోను మార్ఫింగ్ చేసి సామాజిక అనుసంధాన వేదిక ఫేస్బుక్లో కమ్మ కులస్థుల మనోభావాలు దెబ్బతీసే విధంగా పోస్ట్ చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని తెలుగు రైతు జిల్లా ఉపాధ్యక్షులు జ్వాలా ప్రసాద్ శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీనిపై ఆయన శనివారం విలేకరులతో మాట్లాడారు. ఫేస్బుక్ను చూడగా ముఖ్యమంత్రి ఫొటో పక్కన చెప్పు ఉంచి, పలకపై కమ్మ కులస్థుల మనోభావాలు దెబ్బతిసే విధంగా రాసి, దానిని ముఖ్యమంత్రి పట్టుకున్నట్లు ఫొటో మార్ఫింగ్ చేసి ఓ వ్యక్తి పేరు మీద పోస్ట్ చేశారన్నారు.
ముఖ్యమంత్రిని అవమానించటమే కాకుండా, కమ్మ కులస్థుల మనోభావాలు దెబ్బతీసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి ఫొటో మార్ఫింగ్ చేయటం నేరమని, దీనిపై కేసు నమోదు చేసి విచారణ చేపడతామని పోలీసులు తెలిపారు.
'కాపు సంస్థ రుణాలను సద్వినియోగం చేసుకోవాలి'
కాపు కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వం అందిస్తున్న రుణాలను కాపులంతా సద్వినియోగం చేసుకోవాలని కాపు నాడు రాష్ట్ర అధ్యక్షులు పిళ్లా వెంకటేశ్వర రావు కోరారు.
రుణాల కోసం దరఖాస్తులు, కుల ధ్రువీకరణను గాంధీనగర్లోని కాపునాడు కార్యాలయంలో ఉచితంగా అందిస్తున్నామని చెప్పారు. ఉదయం పది గంటల నుంచి రాత్రి తొమ్మిదిన్నర గంటల వరకు అందుబాటులో ఉంటామన్నారు. మూడు వేల మంది దరఖాస్తు చేశారని చెప్పారు.