2019లో జాతీయస్థాయిలో పొత్తులు ఉండవు, ప్రాంతీయ పొత్తులే నిర్ణయాత్మకం: చంద్రబాబు
విజయవాడ: 2019లో జాతీయస్థాయిలో పొత్తులు ఉండవని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రస్థాయి పొత్తులే నిర్ణయాత్మకంగా మారుతాయని చెప్పారు. నవ నిర్మాణ దీక్ష ఆరో రోజు నిర్వహణపై ఆయన టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాజకీయాలకు అతీతంగా ప్రజలందరికీ ప్రభుత్వ పథకాల లబ్ది చేకూరుస్తున్నామని, అందుకే అన్నివర్గాల ప్రజల్లో సంతృప్తి కనిపిస్తోందన్నారు.
పార్టీలతో ప్రమేయం లేకుండా పేదలందరికీ సంక్షేమ పథకాల ప్రయోజనం కల్పించడం వల్లే ప్రజల్లో భరోసా, ఆనందం ఉందని చెప్పారు. గత రెండు రోజులుగా పడుతున్న వర్షాలతో పంటకుంటలు నిండాయని, ఊరూరా జలకళ ఉట్టిపడుతోందని, రైతుల కళ్లల్లో ఆనందం కనిపిస్తోందని చంద్రబాబు అన్నారు. భూగర్భజలాలు పెరుగుతున్నాయన్నారు. పంటకుంటల సందర్శనలో అందరూ పాల్గొని రైతులు, గ్రామీణ ప్రజల్లో స్ఫూర్తిని నింపాలన్నారు.
ఈ ప్రభుత్వం నాలుగేళ్లలోనే ఇంత అభివృద్ధి చేస్తే భవిష్యత్తులో ఇంకెంత చేస్తుందో అనే భరోసా ప్రజల్లో రావాలని చంద్రబాబు అన్నారు. ఆరో రోజు దీక్షల సందర్భంగా గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధిపై చర్చించాలని, నిర్మించిన సిమెంట్ రోడ్లు, డ్రెయిన్లు, ఓడీఎఫ్, ఎల్ఈడీ వీధి దీపాలు ఇలా అన్నింటినీ సందర్శించాలని అధికారులకు సూచించారు. పచ్చదనం పెంపుపై ప్రజలను చైతన్యపరచాలన్నారు.
నాలుగేళ్ళలో సాధించిన అభివృద్ధి చూసి తాను గర్వపడుతున్నానని చంద్రబాబు ఆనందం వ్యక్తం చేశారు. ప్రజాసేవలో ఉన్నంత ఆనందం, సంతృప్తి మరే రంగంలోనూ రాదని, అదే ప్రజాస్వామ్యంలో ఉన్న గొప్పతనమన్నారు. మంచిని చెడుగా, చెడును మంచిగా చూపాలని కొందరు ప్రయత్నిస్తున్నారని విపక్షాలను ఉద్దేశించి అన్నారు. వాళ్ల కుట్రలు, కుతంత్రాలు నెరవేరవన్నారు. ఎవరు మంచో, ఎవరు చెడో ప్రజలందరికీ తెలుసునని చెప్పారు.