'వారానికో కేంద్రమంత్రి, ఏపీలో రాష్ట్రపతి పాలన పెడతామని బీజేపీ బెదిరింపులు'
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సోమవారం నాడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేసిందని, కానీ ఇలాంటి బెదిరింపులకు తాము భయపడేది లేదని చెప్పారు. రాష్ట్రపతి పాలన పెడతామని బెదిరింపులకు పాల్పడ్డారన్నారు.
ఒక్క దెబ్బకు రెండు పిట్టలు: మమత ఎఫెక్ట్, అమరావతిలోని చంద్రబాబు 'భారీ' ప్లాన్
నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం ప్రతికూల పరిస్థితుల్లోకి వెళ్లిందని ఆరోపించారు. తెలుగుదేశం నేతలతో టెలి కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా మోడీపై, బీజేపీపై నిప్పులు చెరిగారు. ఏపీకి ఏమీ చేయలేదన్నారు.
తాటాకు చప్పుళ్లకు బెదరం
కేంద్రమంత్రులు ప్రతి వారం ఏపీకి వస్తున్నారని, అసలు వారు ఏపీకి ఏం చేశారని చంద్రబాబు ప్రశ్నించారు. ప్రతి వారం ఓ కేంద్రమంత్రి ఏపీకి వస్తారని బీజేపీ నేతలు అంటున్నారని, కానీ ఏం చేశారని వస్తారని, అంతేకాకుండా రాష్ట్రపతి పాలన విధిస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారని, కానీ అలాంటి తాటాకు చప్పుళ్లకు బెదరమని చెప్పారు.
అమరావతిలోను భారీ ర్యాలీ
కోల్కతాలో రెండు రోజుల క్రితం మమతా బెనర్జీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరిగిన విషయం తెలిసిందే. 22 పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. ఇలాంటి ర్యాలీని అమరావతిలోను నిర్వహిస్తామని చంద్రబాబు పార్టీ నేతలతో చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్, వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిలు ప్రధాని నరేంద్ర మోడీ డైరెక్షన్లో పని చేస్తున్నారన్నారు. బీసీల్లో అపోహలు తేవాలని వైసీపీ, టీఆర్ఎస్ పార్టీలు కుట్రలు చేస్తున్నాయన్నారు.
గడ్కరీకి చంద్రబాబుకు లేఖ
ఇదిలా ఉండగా, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి పోలవరం నిధులపై చంద్రబాబు లేఖ రాశారు. పోలవరం ప్రాజెక్టుకు ఇవ్వాల్సిన పెండింగ్ నిధులను వెంటనే విడుదల చేయాలని కోరారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి రూ.3,722 కోట్లు తక్షణం విడుదల చేయాలన్నారు. ప్రాజెక్టు నిర్మాణం కోసం రూ.10,459 కోట్లు ఖర్చు చేయగా కేవలం రూ.6,727 కోట్లు మాత్రమే ఇచ్చారన్నారు. గత జులైలో పోలవరంలో గడ్కరీ పర్యటించిన సమయంలో ఫిబ్రవరిలోపు నిధులు మొత్తం విడుదల చేస్తామని చెప్పారని అన్నారు. ఈ విషయంలో ఎంతవరకు మాట మీద నిలబడ్డారో చెప్పాలన్నారు. అయిదు రాష్ట్రాలకు ఉపయోగపడే పోలవరం ప్రాజెక్ట్ను కేంద్రం నిర్లక్ష్యం చేస్తోందన్నారు.
తలసానిపై చంద్రబాబు
తెలంగాణ రాష్ట్ర సమితి నేత, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఏపీలో చేసిన వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు స్పందించారు. తలసాని లాంటివారు వచ్చి ఇక్కడ రాజకీయాలు చేస్తున్నారన్నారు. ఎన్నికల సమయంలో అందరూ నిక్కచ్చిగా ఉండాలని, బంధుత్వాలు, స్నేహాలు పక్కన పెట్టాలన్నారు. డబ్బులన్నీ తామే ఇచ్చామని బీజేపీ చెబుతోందని, బీజేపీ ప్రచారాలను మనం తిప్పికొట్టాలన్నారు.