కరోనాపై పవన్ కళ్యాణ్ పిలుపు: ఏపీ సీఎం ఫండ్కి చంద్రబాబు విరాళం, టీడీపీ నేతలు కూడా
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి ప్రతిపక్ష నేత టీడీపీ అధినే చంద్రబాబు నాయుడు తన వ్యక్తిగతంగా రూ. 10 లక్షల విరాళం ప్రకటించారు. ఆయనతోపాటు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఒక్క నెల జీతం విరాళం విరాళంగా అందజేయాలని నిర్ణయించారు.
అందరూ తమవంతుగా..
రాష్ట్రంలో కరోనా వ్యాధి నిరోధానికి, బాధితుల సహాయానికి తాము ఇచ్చే విరాళం మొత్తం వినియోగించాలని చంద్రబాబు సూచించారు. ఈ విపత్కర పరిస్థితుల్లో అందరూ తమవంతుగా ప్రభుత్వాలకు సహకరించాలన్నారు. కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు చంద్రబాబు. చంద్రబాబు విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించారు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.వ్యక్తిగతంగా తన కుటుంబం నుంచి రూ 10లక్షలు విరాళం ప్రకటిస్తున్నట్లు చంద్రబాబు వెల్లడించారు.
ప్రభుత్వానికి సహకరించాలంటూ..
కరోనాను ఎదుర్కొనేందుకు అందరూ ఐక్యంగా పనిచేయాలని ఈ సందర్భంగా పార్టీ నేతలు, కార్యకర్తలకు చంద్రబాబు పిలుపునిచ్చారు. అంతే కాక అందరికీ అందుబాటులో ఉన్న సోషల్ మీడియాలో కరోనా నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల పై ప్రజల్లో అవగాహన తీసుకొచ్చే విధంగా కృషి చెయ్యాలని చంద్రబాబు సూచించారు. కరోనా నివారణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ప్రజలంతా సహకరించాలని ఆయన కోరారు.
లాక్ డౌన్ పాటించాలంటూ పవన్ కళ్యాణ్
ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ను అందరూ పాటించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పినట్లు మంగళవారం అర్ధరాత్రి నుంచి మొదలయ్యే 21 రోజుల లాక్ డౌన్ను అందరూ విధిగా పాటించాలని మనస్ఫూర్తిగా అభ్యర్థిస్తున్నానని పవన్ తెలిపారు. ఈ లాక్ డౌన్ కు అందరూ సహకరించాలన్నారు. కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు అంతకు మించి వేరే దారి లేదని పవన్ అన్నారు.
ఈ విపత్కర పరిస్థితుల్లో..
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన సూచనలను అనుసరించండని ఆయన ప్రజలను కోరారు. దయచేసి అందరూ ఇంటికే పరిమితం కావాలని కోరుతున్నానని, బయటికి ఎవరు రావద్దని కోరారు. ఒకవేళ ఎవరికైనా ఆరోగ్య సమస్యలు వచ్చినా, ప్రాణా పాయ పరిస్థితులు ఎదురైనా ఎమర్జెన్సీ నెంబర్లకు ఫోన్ చేసి సేవలు, సూచనలు పొందమని కోరారు. ఈ విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు అందరూ సహకరించాలని కోరారు పవన్ కళ్యాణ్.