ఓటుకు నోటు: మీ వల్లే ఇబ్బందులు, చిందులు తొక్కిన చంద్రబాబు
అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి ముచ్చెమటలు పట్టిస్తోందా? అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అనంతపురం జిల్లా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి బుధవారం ఇదే అంశంపై అక్కడ నుంచే పార్టీకి చెందిన ముఖ్య నేతలు, అధికారులతో విస్తృతంగా చర్చలు జరిపినట్టు తెలుస్తోంది.
ఓటుకు నోటు కేసుపై ఉత్కంఠ: ఏం జరుగుతోంది, చంద్రబాబు ప్లాన్ ఏంటీ?
ఓటుకు నోటు కేసులో దర్యాప్తు వేగవంతమైన నేపథ్యంలో ఇంటిలిజెన్స్ అధికారులతో ఫోన్లోనే మంతనాలు సాగించారని సమాచారం. ఓటుకు నోటు కేసులో తాజా పరిణామాలను ఎప్పటికప్పుడు ముందస్తుగా కనిపెట్టడంలో విఫలమయ్యారని దాని వల్ల తాను ఇబ్బందులు పడుతున్నానని నిఘా విభాగం అధికారులపై సీఎం చిందులు వేసినట్లు అధికారుల్లో ప్రచారం జరుగుతోంది.
వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి పిటిషన్ను విచారించిన ఏసీబీ ప్రత్యేకకోర్టు ఈ కేసును మళ్లీ విచారణ జరపి, నెల రోజుల్లో నివేదిక సమర్పించాలంటూ మంగళవారం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. కోర్టు తీర్పు వెలువరించిన రోజు రాత్రి ఏపీ నిఘా విభాగం ఛీప్తో పాటు ఇతర ఉన్నతాధికారులను పిలిపించుకున్న చంద్రబాబు వారిపై మండిపడినట్టు తెలుస్తోంది.
''రాష్ర్టంలో ఉన్న 175 మంది ఎమ్మెల్యేల కదలికలను కూడా తెలుసు కోలేకపోతున్నారు. అధికార పక్షంవారిని విడిస్తే, విపక్షంలో ఉన్నవారిలో 20 మంది మన పార్టీలోనే చేరారు, మిగిలిన 45 మంది కదలికలనూ కనిపెట్టలేకపోతున్నారా? రాజధానికి పక్కనే ఉండే ఎమ్మెల్యే నాకు వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించి ఉత్తర్వులు తెచ్చుకునే వరకూ మీకు తెలియదంటే మీ పనితీరు ఎలా ఉందో అర్ధం అవుతోంది'' అని ఆగ్రహం వ్యక్తం చేశారని సమాచారం.
ఓటుకు నోటుపై వైసిపి ఎమ్మెల్యే ఫిర్యాదు అదే, రేవంత్కు సమన్లు, బాబును విచారిస్తాం!
మరోవైపు ఓటుకు నోటు కేసులో ఏసీబీ కోర్టులో ఏసీబీ మెమో దాఖలు చేసింది. ఏసీబీ చార్జిషీట్ను కోర్టు పరిగణనలోకి తీసుకుని వచ్చే నెల 29న కోర్టు ఎదుట హాజరుకావాలని రేవంత్రెడ్డి, సెబాస్టియన్లకు ఏసీబీ కోర్టు సమన్లు జారీ చేసింది. ఇదే క్రమంలో చంద్రబాబు పాత్రపై దర్యాప్తు చేస్తున్నామని ఏసీబీ తెలిపింది.
దీంతో తనపై ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే ఏం చేయాలన్న దానిపై ఏపీ ఇంటెలిజెన్స్, న్యాయ సలహాదారులు తదితరులతో ఏపీ సీఎం చంద్రబాబు ఇప్పటికే చర్చించినట్లు తెలుస్తోంది. ఎఫ్ఐఆర్లో పేరు నమోదు చేస్తే ఎలాగైనా విచారణను ఆపించేందుకు ప్రయత్నించాలని, ఇందుకు ఉన్న మార్గాలను అన్వేషించాలని ఆదేశించారు.
ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత హైకోర్టు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని కూడా చంద్రబాబు ఆదేశించారని సమాచారం. ఓటుకు నోటు కేసు బయటకు వచ్చిన సమయంలో ఏర్పాటుచేసిన సిట్ను మళ్లీ రంగంలోకి దించడం, ట్యాపింగ్ అంశాన్ని మళ్లీ ముందుకు తేవడంతోపాటు రాజకీయంగా ఎదురుదాడి చేసేలా కూడా వ్యూహాలు రచించాలని అధికారులకు, తన ఆంతరంగికులకు చంద్రబాబు ఆదేశాలు ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి.