మోడీ! డ్రామాలంటారా, పవన్ కూడా చెప్పారు, అప్పుడే కేసీఆర్ యూటర్న్: 'అరెస్ట్'పై బాబు
అమరావతి: మహారాష్ట్ర ధర్మాబాద్ న్యాయస్థానం తనకు పంపించిన అరెస్ట్ వారెంట్ల పైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం ఏపీ అసెంబ్లీలో ప్రకటన చేశారు. బాబ్లీ కేసు అంశం, అరెస్ట్ వారెంట్లపై ఆయన మాట్లాడారు. శాసన సభలో విభజన హామీలు, కేంద్ర వైఫల్యాలపై చర్చ జరిగింది.
మహారాష్ట్రలో, కేంద్రంలో ఉన్నది బీజేపీ ప్రభుత్వం కాదా అని ఈ సందర్భంగా చంద్రబాబు ప్రశ్నించారు. తనకు ఎప్పుడు కూడా నోటీసులు రాలేదని చెప్పారు. అరెస్ట్ వారెంట్లు పంపించి డ్రామాలు ఆడుతున్నానని అంటారా అని నిప్పులు చెరిగారు. సానుభూతి కోసం ప్రయత్నిస్తున్నానని విమర్శలు చేయడం విడ్డూరమన్నారు. తనకు సానుభూతి అవసరం లేదన్నారు.
సెంట్రల్ ముసలం, వైసీపీకి షాక్: జగన్పై ఆగ్రహం.. పార్టీకి వంగవీటి రాజీనామా!
అరెస్ట్ వారెంట్ పంపి డ్రామాలు అంటారా?
నాడు బాబ్లీ ప్రాజెక్టు విషయంలో తెలుగు జాతి కోసం పోరాడానని చంద్రబాబు చెప్పారు. తమకు జారీ అయిన అరెస్ట్ వారెంట్ల పైన చర్చిస్తున్నామని చెప్పారు. త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. కోర్టుకు హాజరయ్యే విషయమై రేపు తుది నిర్ణయం తీసుకోనున్నారు. అరెస్టు వారెంట్ పంపి నన్ను డ్రామాలు అంటారా అని మండిపడ్డారు.
అప్పుడు మట్టి, నీరు తెచ్చారు
ప్రధాని నరేంద్ర మోడీకి గుజరాత్ పైన ఉన్న ప్రేమలో అయిదో వంతు ప్రేమ ఏపీ పైన ఉంటే చాలునని చంద్రబాబు అన్నారు. బీజేపీ నేతలు నరేంద్ర మోడీకి వంతపాడటం మానివేసి, నవ్యాంధ్ర ప్రయోజనాల కోసం పాటుపడాలన్నారు. అమరావతి శంకుస్థాపనకు వచ్చిన మోడీ మట్టి, నీరు తెచ్చారని ఎద్దేవా చేశారు.
పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య విభేదాలు విభేదాలు సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారని చంద్రబాబు అన్నారు. హైకోర్టును విభజించమంటే సుప్రీం కోర్టులో కేసులు వేస్తున్నారని ధ్వజమెత్తారు. యూసీలు ఇవ్వడం లేదని కేంద్రం అబద్దాలు చెబుతోందన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ పెట్టి ఏపీకి నిధులు ఇవ్వాలని చెప్పారని గుర్తు చేశారు.
అప్పుడే తెరాస విభేదించింది, కేసీఆర్కు చాలాసార్లు చెప్పా
బీజేపీతో మనం విబేధించిప్పుడే తెరాస కూడా ఏపీతో విబేధించడం మొదలు పెట్టిందని కేసీఆర్ను ఉద్దేశించి చంద్రబాబు అన్నారు. తెలుగుజాతి కోసం కలిసి పని చేద్దామని, కలిసి ఉందామని తెరాసకు చాలాసార్లు చెప్పానని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వమని చెప్పిన తెరాస కూడా ఆ తర్వాత మాట మార్చిందన్నారు.
ప్రత్యేక హోదా ఉద్యమ కేసులపై
ప్రత్యేక హోదా ఉద్యమ కేసుల ఎత్తివేతపై చంద్రబాబు అసెంబ్లీలో ప్రస్తావించారు. కేసుల ఎత్తివేతపై సమీక్ష చేస్తున్నామని వెల్లడించారు. శాంతియుత ఉద్యమాలకు సంబంధించిన కేసులను ఎత్తివేస్తామని స్పష్టం చేశారు.