షాక్ మీద షాక్: టీడీపీకి మరో ఇద్దరు! రాజ్యసభలో మోడీకి బాబు దెబ్బ
Recommended Video
న్యూఢిల్లీ/హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ కేంద్ర కేబినెట్ నుంచి బయటకు రావడంతో బీజేపీకి ఇబ్బందులు తప్పవని అంటున్నారు. ఇటీవల టీడీపీ నేతలు కేంద్రమంత్రులుగా ఉన్నారు. అలాంటప్పుడు తమ పార్టీ ఎంపీలు సభలో ఆందోళన చేసినా వారు మౌనంగా కూర్చున్నారు.
కాబట్టి బీజేపీకి ఎదురుగాలిలా కనిపించలేదు. ఇప్పుడు వారు కూడా రాజీనామా చేసి ఆందోళనల్లో పాల్గొంటామని చెప్పడం గమనార్హం. ఏపీలో, రాజ్యసభలో బీజేపీకి చిక్కులు ఉంటాయని అంటున్నారు.
తగినంత మెజార్టీ లేక ఇబ్బంది
త్వరలో రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. మిత్రపక్షాలతో కలిసి కూడా రాజ్యసభలో తగినంత మెజార్టీ లేకపోవడం ఇప్పటికే బీజేపీని ఇబ్బందులకు గురి చేస్తోంది. ఇప్పుడు టీడీపీ కూడా కేబినెట్ నుంచి తప్పుకుంది. అయితే ఎన్డీయే నుంచి తప్పుకోలేదని చెప్పడం ఊరటే అయినప్పటికీ.. హోదా డిమాండ్ కోరుతూ వారు ఇరకాటంలో పెట్టే అవకాశాలుంటాయి.
97కు పెరిగే అవకాశం
మార్చిలో రాజ్యసభ ఎన్నికల తర్వాత బీజేపీ ఎంపీల సంఖ్య 73కు పెరిగే అవకాశముంది. అయినప్పటికీ మెజార్టీ 123కు చాలా దూరంలో ఉంటుంది. ప్రస్తుతం మిత్రపక్షాలతో కలిపి 82 స్థానాలు ఉన్నాయి. మార్చిలో జరిగే ఎన్నికల తర్వాత ఎన్డీయే రాజ్యసభ సభ్యుల సంఖ్య 97కు పెరిగే అవకాశముంది.
టీడీపీకి ఆరుగురు సభ్యులు, 8 మంది ఎంపీలతో ఇరకాటం
ప్రస్తుతం టీడీపీకి ఆరుగురు రాజ్యసభ సభ్యులు ఉన్నారు. మరో రెండు గెలుచుకోనుంది. అప్పుడు ఎనిమిదికి పెరుగుతాయి. ఎనిమిది మంది రాజ్యసభ ఎంపీలతో టీడీపీ బీజేపీని ఇరకాటంలో పెట్టే అవకాశాలు ఉంటాయి. 2020 నాటికి బీజేపీ రాజ్యసభలో మెజార్టీకి చేరువయ్యే అవకాశముంది.
బీజేపీకి చుక్కలు
ఈ నేపథ్యంలో టీడీపీ బయటకు పోవడం, మరో రెండు స్థానాలు త్వరలో గెలుచుకోనుండటంతో ప్రత్యేక హోదాపై వారు మరింత నిలదీసి, బీజేపీకి చుక్కలు చూపించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. కేంద్ర కేబినెట్ నుంచి టీడీపీ గురువారం బయటకు వచ్చిన విషయం తెలిసిందే.
ఇద్దరి రాజీనామా
టీడీపీ తరఫున కేంద్ర మంత్రివర్గంలో ప్రాతినిథ్యం వహిస్తున్న పౌరవిమానయానశాఖ మంత్రి అశోక్ గజపతి రాజు, శాస్త్ర, సాంకేతికశాఖ సహాయమంత్రి సుజనా చౌదరి తమ పదవులకు రాజీనామాలు చేసిన విషయం తెలిసిందే. గురువారం సాయంత్రం ఆరు గంటలకు లోకకల్యాణ్మార్గ్లో ప్రధాని నరేంద్ర మోడీని కలిసి ఇద్దరూ సంయుక్తంగా రాజీనామా లేఖలు సమర్పించారు.
ప్రజా సెంటిమెంట్ను గౌరవించి
ప్రజా సెంటిమెంట్ను గౌరవించి కేంద్రం నుంచి వైదొలగాలని తమ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తామిద్దరం రాజీనామాలు చేసినట్లు వారు ప్రకటించారు. ఇద్దరితో ప్రధాని సుమారు పది నిమిషాల పాటు మాట్లాడారు. కారణాలను వారు ఆయనకు తెలిపారు. ప్రభుత్వంలో పనిచేసే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుత పరిస్థితులకు దారితీసిన కారణాలను వివరిస్తూ ఒక లేఖను ప్రధానికి ఇవ్వడంతో పాటు, రాష్ట్రపతిని సంబోధిస్తూ రాసిన రాజీనామా పత్రాన్ని దానికి జత చేశారు. అశోక్గజపతిరాజు మాత్రం ఎలాంటి కారణాలు చెప్పకుండా తాను పదవికి రాజీనామా చేస్తున్నానని, దాన్ని ఆమోదించాలని కోరారు. సుజన మాత్రం రాజీనామాకు కారణాలు చెప్పారు.
బాబు-మోడీ మధ్య
కేంద్రం నుంచి టీడీపీ మంత్రులు వైదొలగాలని నిర్ణయించిన నేపథ్యంలో ప్రధాని మోడీ గురువారం సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫోన్ చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై కూర్చుని మాట్లాడుకుందామని, తొందరపడొద్దని ప్రధాని సూచించారని, నిన్న మీరు నా కోసం ఫోన్ చేశారని, అప్పటికే రాత్రి బాగా ఆలస్యమైందని, గురువారం ఉదయమే రాజస్థాన్ పర్యటనకు వెళ్లి తిరిగొచ్చిన వెంటనే ఫోన్ చేస్తున్నానని మోడీ పేర్కొన్నారని చెప్పిన విషయం తెలిసిందే. నాలుగేళ్లు వేచి చూశామని, ఇక రాజీనామాలు చేస్తున్నామని చెప్పామని చంద్రబాబు ఆయనతో అన్నారు.