జగన్ ను టార్గెట్ చేసిన చంద్రబాబు: లక్షల కోట్లు కొట్టేద్దామని ఇప్పుడు విశాఖ ఉక్కుపై పడ్డావా?
టిడిపి అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకి విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయాలని కేంద్రం తీసుకున్న నిర్ణయంతో జగన్ సర్కార్ ని టార్గెట్ చేయడానికి మరో ఆయుధం దొరికినట్లయింది . విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాలలో కూరుకుపోయిన కారణంగా,దానిని ప్రైవేటీకరణ చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ మరోమారు ఉక్కు ఉద్యమం కొనసాగుతోంది.
టీడీపీ కార్యకర్తలా నిమ్మగడ్డ, మార్చి 31 తర్వాత ఆయనను కుక్క కూడా పట్టించుకోదు : మరోమారు రోజా
ప్రగల్భాలు పలికే జగన్ రెడ్డి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడు
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని, సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆ పని చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు జగన్ ను టార్గెట్ చేస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిగా జగన్ రెడ్డికి ఉందంటూ ట్వీట్ చేసిన చంద్రబాబు ఢిల్లీని ఢీ కొడతా, మోడీ మెడలు వంచుతాం అని ప్రగల్భాలు పలికే జగన్ రెడ్డి, నీ క్విడ్ ప్రో కో దోపిడీ బుద్ధిని పక్కన పెట్టు, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడు అంటూ ట్విట్టర్లో ట్వీట్ చేశారు.
ప్రైవేటుపరం చేయాలని చూస్తే మరో ఉద్యమం తప్పదు
విశాఖ ఉక్కు ఆంధ్రుల శాశ్వత హక్కు, దీనిని ప్రైవేటుపరం చేయాలని చూస్తే మరో ఉద్యమం తప్పదు, లక్షలాది మంది ఏళ్లతరబడి ఉద్యమించి 32 మంది ప్రాణత్యాగం తో , అమరావతి అమృతారావు ఆమరణ నిరాహార దీక్ష తో సాధించుకున్నామంటూ చంద్రబాబు పేర్కొన్నారు . విశాఖ ఉక్కు కర్మాగారం తెలుగువారి ఉద్యమ ఫలితం అని , విశాఖ మణిహారం అని పేర్కొన్న చంద్రబాబు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా కర్మాగారాన్ని కాపాడాల్సిన బాధ్యత తనపై ఉన్న విషయాన్ని జగన్ గుర్తుంచుకోవాలని స్పష్టం చేశారు.
కొండలు , గుట్టలు , భూములు అన్నీ అయిపోయాయి .. ఇప్పుడు విశాఖ ఉక్కుపై పడ్డావా ?
అభివృద్ధి వికేంద్రీకరణకే విశాఖలో పరిపాలన రాజధాని అన్న జగన్ మోహన్ రెడ్డీ... నువ్వు ఇప్పటికే ఆ పేరుతో విశాఖలో కొండలు కొట్టేశావు, గుట్టలను మింగేశావు , భూములను ఆక్రమించేశావు .. ఇప్పుడు విశాఖ ఉక్కు పై పడ్డావా అంటూ ప్రశ్నించిన చంద్రబాబు నాయుడు విశాఖ స్టీల్ ప్లాంట్ పై జనాన్ని ఏమార్చి, తుక్కు కింద కొనేసి లక్షల కోట్లు కొట్టేద్దాం అనుకుంటున్న జగన్ రెడ్డి గ్యాంగ్ కుతంత్రాన్ని ప్రజల మద్దతుతో అడ్డుకుని తీరుతామని పేర్కొన్నారు.
విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేస్తుంటే ఓ సీఎంగా నీ బాధ్యత ఏంటి ?
అంతేకాదు ప్రత్యక్షంగా 18 వేల మంది శాశ్వత ఉద్యోగులకు, 22 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులకు, పరోక్షంగా లక్ష మంది కి పైగా ఉపాధి కల్పించే విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటుపరం చేస్తుంటే ఒక ముఖ్యమంత్రిగా నీ బాధ్యత ఏంటి ? అని ప్రశ్నించారు చంద్రబాబు. నీ 31 కేసుల మాఫీ కోసం 151 మంది ఎమ్మెల్యేలు 22 మంది లోక్సభ సభ్యులు , ఆరుగురు రాజ్యసభ సభ్యులు కేంద్రానికి తాకట్టు పెట్టేశావ్ అంటూ జగన్ పై మండిపడ్డారు. ఇక ప్రత్యేక హోదాని బాబాయ్ హత్య కేసుకి మార్ట్ గేజ్ చేశావని చంద్రబాబు విమర్శించారు.
గతంలో టీడీపీ ఒకమారు విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడింది .. మీరెందుకు చెయ్యరు?
ఇప్పుడు విశాఖ ఉక్కు పై స్పందించవద్దని ఎంపీల నోరు కుట్టేశావని చంద్రబాబు విమర్శలు గుప్పించారు. గతంలో స్వర్గీయ వాజ్ పాయ్ ప్రభుత్వంలో ఇదే పరిస్థితి వస్తే, కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చి నాటి టిడిపి ప్రభుత్వం విశాఖ ఉక్కును కాపాడిందని, ఆ పని ఇప్పుడు మీరు ఎందుకు చేయరు అంటూ చంద్రబాబు జగన్ ను నిలదీశారు. మొత్తానికి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ రగడ ప్రతిపక్ష పార్టీలకు ఆయుధంగా మారగా , ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని తీవ్ర ఇరకాటంలోకి నెట్టింది.