చాలా అరుదు: ‘నంద్యాల’పై చంద్రబాబు సంచలన నిర్ణయం
అమరావతి: నంద్యాల ఉప ఎన్నికలను తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో నంద్యాలలో టీడీపీ గెలుపు కోసం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏకంగా 12 మంది ఎమ్మెల్యేలను ఈ ఎన్నికకు ఇంచార్జీలుగా నియమించడం విశేషం.
గంటపాటు చర్చ
సోమవారం ఉదయం రాష్ట్రపతి ఎన్నికలో ఓటు వేసిన అనంతరం సచివాలయంలో ఎమ్మెల్యేలతో సీఎం చంద్రబాబునాయుడు ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి 12 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు. నంద్యాల ఉప ఎన్నికలో అనుసరించాల్సిన వ్యూహంపై సుమారు గంట పాటు చర్చ జరుగింది.
గెలుపు వ్యూహాలు
ఈ సమావేశంలో గెలుపుకోసం ఎలా ముందుకు వెళ్లాలన్న విషయంపై ఇంఛార్జీలకు సీఎం చంద్రబాబు దిశా నిర్దేశం చేశారు. ఇంఛార్జీలుగా నిమ్మల రామానాయుడు, బోండా ఉమ, బోడే ప్రసాద్సహా 12 మంది ఎమ్మెల్యేలు నియమించినట్లు తెలుస్తోంది.
Recommended Video
ఇది అరుదే..
ఈ 12మంది ఇంఛార్జీలు గురువారం నుంచి రంగంలోకి దిగనున్నట్లుగా విశ్వసనీయ వర్గాల సమాచారం. కాగా, ఇది వరకు జరిగిన ఎన్నికలను తీసుకుంటే 12మంది ఇంఛార్జీలను నియమించిన దాఖలాలు చాలా అరుదు. ఇద్దరు, ముగ్గురు ఉంటేనే ఎక్కువ.
హోరీ హోరీగా..
నంద్యాల ఉప ఎన్నికలో ఎలాగైనా తమ జెండానే నంద్యాలపై రెపరెపలాడించాలని టీడీపీ, వైసీపీ అధినేతలు పక్కా వ్యూహాలతో ముందుకు వెళుతున్నారు. కాగా ఇప్పటికే వైసీపీ పార్టీ శ్రేణులు నంద్యాలలో ప్రచారం కూడా మొదలెట్టేశారు. మరోవైపు టీడీపీ అభ్యర్థి తరఫున మంత్రులు కూడా నంద్యాలలోనే మకాం వేసి ప్రచారం చేస్తున్నారు. ఈ ఉప ఎన్నికలు హోరాహోరీగానే జరగనున్నాయి. రెండు పార్టీలు తమ అభ్యర్థుల గెలుపుపై గట్టి నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నాయి.