'కరుణానిధి ఎన్టీఆర్తో చాలా సన్నిహితంగా ఉండేవారు, ఆయనతో విశేష అనుభవం'
అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళగిరిలో బుధవారం జరిగిన నోడల్ అధికారుల రాష్ట్రస్థాయి సమావేశంలో కరుణానిది మృతికిపై తీర్మానం చదివి వినిపించారు. తమిళనాడును అగ్రశ్రేణి రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో ఆయన సేవలు అసమానమని ప్రశంసించారు.
ఎవరీ కరుణానిధి? ఇదీ రాజకీయ నేపథ్యం-ఎన్నో రికార్డ్లు: కీలక అంశాలు
సభికులతో రెండు నిమిషాలు మౌనం పాటించారు. తమిళ ప్రజలు, కరుణానిధి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. కరుణానిధి రాటుదేలిన రాజకీయవేత్త అన్నారు. కోట్లాది మందిని ప్రభావితం చేసారన్నారు. తమిళనాడులో తిరుగులేని నేత అన్నారు.
దక్షిణ భారతదేశంలో పెద్ద రాజకీయ శక్తిగా ఇన్నేళ్ల పాటు కొనసాగారని, రాజకీయ రంగంతో పాటు కళా రంగంలోను తనదైన ముద్ర వేశారన్నారు. ఎన్నో సామాజిక మార్పులకు నాంది పలికారన్నారు. కరుణానిధితో తనకు మంచి అనుభవం ఉందన్నారు. స్వర్గీయ నందమూరి తారక రామారావుతో ఆయన చాలా సన్నిహితంగా మెలిగేవారన్నారు. 1996లో యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటు చేసినప్పుడు కరుణ అండగా నిలిచారన్నారు. ఆయన మృతి దేశానికి, తమిళనాడుకు తీరని లోటు అన్నారు.
సినీ-రాజకీయాల్లో చెరగని ముద్ర: ఎంజీఆర్ ఎంట్రీతో ప్రతిపక్షంలోనే!: కరుణానిధి ప్రస్థానం
అత్యుత్తమ రాజకీయ నాయకుడిని కోల్పోయామని నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు. ఆయన మరణం దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. కరుణ మరణం రాజకీయాలకు మాత్రమే కాదని, చిత్రసీమకు తీరని లోటు అన్నారు. తన తండ్రి ఎన్టీఆర్తో ఆయనకు విశేషమైన అనుభవం ఉండేదన్నారు.
80 ఏళ్ల రాజకీయ అనుభవం, ఐదుసార్లు సీఎంగా, 13సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందడం మామూలు విషయం కాదన్నారు. అలాంటి మహానుభావుడు మన మధ్య లేకపోవడం బాధాకరం అన్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.