బాబు సీబీఐకి నో చెప్పడం చిత్తుకాగితమే: ఉండవల్లి, జగన్పై దాడి కేసు భయంవల్లే ఈ నిర్ణయమా?
అమరావతి: కేంద్ర దర్యాఫ్తు సంస్థ సీబీఐకి ఏపీలో దాడులు, దర్యాఫ్తు చేసే అధికారాన్ని నిరాకరిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురువారం సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో సీబీఐ సంస్థ ప్రవేశానికి వెసులుబాటు కల్పించే సమ్మతి ఉత్తర్వులను ఉపసంహరించుకున్నారు. దీనిపై పలువురు నేతలు స్పందించారు.
చంద్రబాబు చాలా తెలివైనవారు: కిరణ్ కుమార్ రెడ్డి, పవన్ కళ్యాణ్కు బొత్స గట్టి కౌంటర్
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అంబటి రాంబాబు, విజయ సాయి రెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, బీజేపీ ఏపీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ తదితరులు మాట్లాడారు. సీబీఐకి చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారని ఒకరు ప్రశ్నిస్తే, ఆ జీవో ఓ చెత్త బుట్ట అని మరొకరు వ్యాఖ్యానించారు.
చంద్రబాబు ప్రయత్నాలు సిగ్గుచేటు
సీబీఐని రాష్ట్రంలోకి రానివ్వకుండా చంద్రబాబు ప్రయత్నం సిగ్గుచేటు అని బీజేపీ ఏపీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. చంద్రబాబు నాయకత్వంలో వ్యవస్థలన్నీ నిర్వీర్యమయ్యాయని ఆరోపించారు. మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావుకు ప్రాజెక్టుల గురించి ఏమైనా తెలుసా అని ప్రశ్నించారు. పోలవరం విషయంలో ఏపీ ప్రభుత్వం బ్రోకర్ పని చేస్తోందని ఆరోపించారు. దేశమంతా చక్రంలా తిరిగి వచ్చి, చక్రం తిప్పుతున్నానని ఫీలవుతున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు మానసిక వ్యాధితో బాధపడుతున్నారని తాను రెండేళ్లుగా చెబుతున్నానని అన్నారు. ఏదో జరుగుతున్నట్లు చంద్రబాబు తనంతట తానే ఊహించుకున్నారని చెప్పారు. అక్రమార్జనతో రాష్ట్రాన్ని దోచుకున్న వారికి చంద్రబాబు అండగా ఉంటున్నారని ఆరోపించారు. చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని ఖూని చేశారన్నారు.
చంద్రబాబుకు అంత భయం ఎందుకు?
ఆంధ్రప్రదేశ్లో 2014 నుంచి చట్టాన్ని ఉల్లంఘిస్తూనే ఉన్నారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి శుక్రవారం అన్నారు. కేంద్ర ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు అంత భయం ఎందుకని ప్రశ్నించారు. ఫెడరల్ వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారని చెప్పారు. కేంద్రంతో విభేదించిన నాటి నుంచి చంద్రబాబు భయంతో ఉన్నారని చెప్పారు.
జగన్పై కత్తి దాడి కేసు, బాబు వైపు అంబటి వేలు
జగన్ పైన దాడి కేసులో కర్త, కర్మ, క్రియ అన్నీ చంద్రబాబేనని వైసీపీ నేత అంబటి రాంబాబు ఆరోపించారు. చంద్రబాబు తప్పు చేశారు కాబట్టే కేసు విచారణకు భయపడుతున్నారని, అందుకే సీబీఐ అంటే వణికిపోతున్నారని విమర్శించారు. సీబీఐపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో అనేక అనుమానాలు కలుగుతున్నాయని చెప్పారు. సీబీఐ దర్యాఫ్తును అడ్డుకోవడానికి కారణం ఏమిటో చంద్రబాబు చెప్పాలన్నారు. ఆపరేషన్ గరుడ పైన కూడా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. వేల కోట్లు దోచుకున్న చంద్రబాబు ఏ విచారణకైనా సిద్ధపడగలరా అని సవాల్ చేశారు. ఎవరైనా చట్టానికి లోబడి పని చేయాలని, వ్యవస్థలను గౌరవించలేని వ్యక్తి ఆ పదవిలో కొనసాగడం అవసరమా అన్నారు.
ఆ జీవో చిత్తు కాగితంతో సమానం
దీనిపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా స్పందించారు. దేశవ్యాప్తంగా ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో అవకతవకలపై సీబీఐ నేరుగా దాడులు నిర్వహించవచ్చని చెప్పారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఏపీలో ముందస్తు అనుమతి లేకుండా దాడులు నిర్వహించడం కుదరదని రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో చెల్లదన్నారు. చంద్రబాబు తన పదిహేనేళ్ల పాలనలో ఒక్కసారి కూడా సీబీఐ విచారణ కోరలేదన్నారు. కోర్టులు ఆదేశించినా లేదా సంబంధిత రాష్ట్రం కోరినా సీబీఐ రంగంలోకి దిగి విచారణ చేపట్టవచ్చునని చెప్పారు. సీబీఐకి ఇచ్చిన సమ్మతి ఉత్తర్వులను తాజాగా రద్దు చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. చంద్రబాబు ప్రభుత్వం జారీ చేసిన జీవో చిత్తు కాగితంతో సమానమన్నారు. గతంలో యూపీ సీఎం కల్యాణ్ సింగ్, బీహార్ నేత పప్పూ యాదవ్ విషయంలో ఇలాంటి నిషేధాలు ఉన్నా విచారణ కొనసాగిందని, అధికారులు చర్యలు తీసుకున్నారని చెప్పారు. ఐటీ దాడులతో తమను బలహీనపర్చే ప్రయత్నాలు చేస్తున్నారని చంద్రబాబు ఆరోపణలు సరికాదని చెప్పారు.