విభజనతో అవకాశాలు: సింగపూర్ పర్యటనలో చంద్రబాబు, బాబును ఏకేసిన బొత్స
అమరావతి: ఆంధ్రప్రదేశ్ను గొప్ప అభివృద్ధి రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. సింగపూర్ పర్యనటలో భాగంగా ఆయన ఇనిస్టిట్యూట్ ఆఫ్ సౌత్ ఏషియన్ స్టడీస్ ఇనిస్టిట్యూట్లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సింగపూర్ పారిశ్రామిక వేత్తలతో చంద్రబాబు మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్లో జలవనరులు పుష్కలంగా ఉన్నాయన్నారు. లాజిస్టిక్స్ రంగంలో ఏపీ నెంబర్ వన్ అవుతుందన్నారు. నదుల అనుసంధానంతో చరిత్ర సృష్టించామని చెప్పిన ఆయన రాష్ట్ర విభజన సమస్యలతో పాటు అవకాశాలూ కల్పించిందన్నారు.
కార్గో విభాగంలో ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం రెండో స్ధానంలో ఉందన్నారు. తొలి స్ధానానికి చేరడమే తమ లక్ష్యమని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో ఐరన్ ఓర్, బాక్సైట్ సహా అనేక ఖనిజ నిక్షేపాలున్నాయన్నారు. ప్రధాని మోడీ నాయకత్వంలో గత ఏడాదిన్నరగా భారత్ వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు.
అంతకముందు చంద్రబాబు సింగపూర్ వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి ఈశ్వరన్తో భేటీ అయ్యారు. ఈ భేటీలో రాజధాని నిర్మాణంపై ఇద్దరూ కూలంకుషంగా చర్చించారు. అధికారులకు శిక్షణ, సామర్ధ్యం పెంపు, ఆకర్షణీయ నగరాలు లాంటి అంశాలపై చర్చించారు.
చంద్రబాబు తన వ్యక్తిగత హోదాను పెంచుకునే పనిలో పడ్డారు: బొత్స
ఏపీకు ప్రత్యేకహోదా వస్తే, భవిష్యత్తు బాగుంటుందన్న ఆకాంక్ష ప్రజలందరిలో ఉందని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. ప్రత్యేకహోదాను పక్కనబెట్టి చంద్రబాబు నాయుడు మాత్రం తన వ్యక్తిగత హోదాను పెంచుకునే పనిలో పడ్డారని మండిపడ్డారు.
ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో ఏపీ ప్రజలను టీడీపీ, బీజేపీలు కలసి మోసం చేశాయన్నారు. ప్రత్యేకహోదా గురించి ఢిల్లీలో చంద్రబాబు ఏమీ మాట్లాడటం లేదన్నారు. వైసీపీ అధినేత జగన్ ఒత్తిడితోనే అసెంబ్లీలో ప్రత్యేక హోదాపై తీర్మానం చేశారని చెప్పారు.