కలాంకు అవమానం.. ఆయన కంటే వైఎస్ఆర్ గొప్పవారా? చంద్రబాబు, బీజేపీ ఫైర్
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మరో కొత్త వివాదంలో చిక్కుకున్నది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీ సర్కార్ పలు పథకాలు, పురస్కారాల మార్పుకు శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలోనే ప్రపంచ ప్రఖ్యాత సైంటిస్టు, మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం పేరుతో ఉన్న పురస్కారాన్ని అధికారులు మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత వైఎస్ రాజశేఖరరెడ్డి పేరుతో మార్చడంపై పలువురు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. దివంగత నేత వైఎస్ఆర్కు ప్రస్తుత ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కుమారుడు అనే విషయం తెలిసిందే. వివరాల్లోకి వెళితే..
పదో తరగతి విద్యార్థుల కోసం
ఏపీలో పదో తరగతి బోర్డు పరీక్షలో ఉత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులకు కొద్దికాలంగా ప్రభుత్వం డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ప్రతిభా విద్యా పురస్కారాన్ని ప్రోత్సాహకంగా అందజేస్తున్నది. అయితే పథకాల పేరు మార్పు నేపథ్యంలో సోమవారం కలాం అవార్డు పేరును వైఎస్ఆర్ విద్యా పురస్కారంగా మార్చుతూ రాష్ట్ర విద్యాశాఖ ప్రభుత్వ ఉత్తర్వులను జారీ చేసింది. ఈ అవార్డును మౌలానా అబ్దుల్ కలం ఆజాద్ జన్మదినం నవంబర్ 11వ తేదీన జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా అందజేస్తున్నట్టు ప్రకటించింది.
చంద్రబాబు ధ్వజం
అయితే ఏపీ ప్రభుత్వం తీసుకొన్న పేరు మార్పు నిర్ణయంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాజీ సీఎం చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. డాక్టర్ కలాం సేవలు, ప్రతిభ దేశానికి స్ఫూర్తిగా నిలిచాయి. అలాంటి మహోన్నతమై వ్యక్తి కలాం పేరున ఉన్న పురస్కారాన్ని మార్చి వైఎస్ఆర్ విద్యా పురస్కారం పేరుతో మార్చడం షాక్కు గురిచేసింది.
కలాంను అవమానించడమే
దేశానికి ఎంతో సేవ చేసిన గొప్ప వ్యక్తి కలాంను అవమానించడమే అని ఏపీ ప్రభుత్వంపై చంద్రబాబు మండిపడ్డారు. ఈ మేరకు ట్విట్టర్లో ప్రభుత్వ ఉత్తరుల కాపీని ట్వీట్ చేశారు. ఈ అవార్డును తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబు నాయుడు ఈ పురస్కారాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే.
భగ్గుమన్న బీజేపీ
ఇక ఏపీ ప్రభుత్వం నిర్ణయంపై బీజేపీ కూడా భగ్గుమన్నది. ఏపీ సర్కారు తీరు కలాంను అవమానించేలా ఉంది. వారి అహంకారానికి ఇది నిదర్శనం అంటూ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ వ్యవహారంపై బీజేపీ జాతీయ ఐటీ విభాగాధిపతి అమిత్ మాల్వియ అభ్యంతరం వ్యక్తం చేస్తూ ట్విట్టర్లో స్పందించారు.
కలాం కంటే వైఎస్ఆర్ గొప్పవారని
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకొన్న నిర్ణయం ఎలాంటి ఆశ్చర్యాన్ని కలిగించలేదు. దేశం గర్వించదగిన గొప్ప విద్యావేత్త, సైంటిస్టు, భారత రత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం కంటే తన తండ్రి వైఎస్ఆర్ గొప్పవారని భావిస్తున్నారు అని అమిత్ చురకలంటించారు. గతంలో దివంగత వైఎస్ఆర్ అధికారంలోకి వచ్చిన సమయంలో సంక్షేమ పథకాలకు, స్టేడియాలకు, రోడ్లు, ఎయిర్పోర్టులకు నెహ్రూ, గాంధీ కుటుంబం పేర్లను పెట్టారు అని అని తన ట్వీట్లో పేర్కొన్నారు.