హైదరాబాద్కు వచ్చిన చంద్రబాబు: మనవడు దేవాన్ష్కు దగ్గరయ్యేందుకే..!
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మంగళవారం రాత్రి విజయవాడ నుంచి హైదరాబాద్కు చేరుకున్నారు. తీవ్రమైన పని ఒత్తిడితో సతమతమవుతున్న చంద్రబాబు తన మనవడు, నారా లోకేశ్ కుమారుడు దేవాన్ష్తో కాసేపు గడిపేందుకే హైదరాబాదు వచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
గత కొంతకాలంగా చంద్రబాబు కనిపించకపోవడంతో తన మనవడు తన వద్దకు వచ్చేందుకు సైతం వెనకాడుతున్నాడని పలు బహిరంగ సభల్లో చంద్రబాబు ప్రస్తావించారు. అంతేకాకుండా ఎప్పుడైనా హైదరాబాద్కు వచ్చినప్పుడు తన మనవడిని దగ్గరకు తీసుకుందామంటే ఏడుస్తూ దూరంగా వెళుతున్నాడని ఇటీవలే సహచర మంత్రులకు చెప్పుకుని చంద్రబాబు బాధపడ్డారు.
ఈ నేపథ్యంలో చంద్రబాబు తన మనవడితో కాసేపు గడిపేందుకు మంగళవారం రాత్రి హైదరాబాద్కు వచ్చారు. బుధవారం నాడు ఆయన హైదరాబాద్ నుంచి బయల్దేరి నేరుగా ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటనకు వెళతారు. ఇటీవల విశాఖలో టీడీపీ పార్టీ ఆఫీసు ప్రారంభించడానికి వచ్చిన నారా లోకేశ్ ఇదే విషయాన్ని ప్రస్తావించారు.
తన తండ్రి చంద్రబాబునాయుడు, హైదరాబాదుకు వచ్చిన సందర్భంలో తన కొడుకు(దేవాంశ్)ను ఎత్తుకోవడానికి ప్రయత్నిస్తే వాడు ఆయన దగ్గరకు వెళ్లకుండా బేర్ మంటున్నాడంటూ లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబమంతా హైదరాబాద్లో ఉంటే తాతయ్య ఒక్కడే అమరావతిలో ఉండటంతో మనవడితో అనుబంధం ఏర్పడుకుండా పోతుందని లోకేశ్ ఆవేదన చెందాడు.
ఇలా లోకేశ్ చెప్పడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటంటే చంద్రబాబు నాయుడు చాలా త్యాగం చేస్తున్నారని లోకేశ్ ఉద్దేశం. అంతేకాదు రాష్ట్రం కోసం కుటుంబాన్ని వదలి పనిచేస్తున్నారని, ఆయనంతటి త్యాగపురుషుడు మరొకరు లేరని లోకేశ్ ఉద్దేశం. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు విజయవాడ నుంచే పరిపాలన కొనసాగిస్తున్నారు.
ఉండవల్లి సమీపంలోని లింగమనేని గెస్ట్హౌస్లో ఉంటూ 'మన రాష్ట్రం నుంచే మన పాలన' అనే నినాదాన్ని పాటిస్తున్నారు. ఆయన కుటుంబం మాత్రం హైదరాబాద్ లోనే ఉండగా ఆయన మాత్రమే విజయవాడలో ఉంటూ అప్పుడప్పుడూ హైదరాబాద్ వచ్చి పోతున్నారు.