ప్రధానికి హోదా సాధనా సమితి కౌంటర్: విడ్డూరంగా ఉంది.. మోడీ దీక్షపై బాబు విసుర్లు
అమరావతి: పార్లమెంటులో ప్రతిపక్షాల తీరుకు నిరసనగా ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ ఎంపీలు గురువారం నిరాహార దీక్ష చేయనున్నారు. ఢిల్లీలో మోడీ, కర్నాటకలో బీజేపీ జాతీయ అధ్యక్షుల అమిత్ షా దీక్షలో పాల్గొంటారు. పలువురు ఎంపీలు వారి వారి నియోజకవర్గాల్లో పాల్గొంటారు.
జగన్లా కాదు, అడుక్కు తినేవాళ్లం కాదు: లోకేష్, 'మోడీ! మాతో కాపురం చేస్తూ జగన్తో మాటలా'
మరోవైపు, ప్రధాని నిరాహార దీక్షకు కౌంటర్గా, ఆయన దీక్షను నిరసిస్తూ ప్రత్యేక హోదా సాధనా సమితి ఆధ్వర్యంలో గురువారం విజయవాడలో దీక్ష చేపట్టనున్నారు. ప్రత్యేక హోదా పైన ఇచ్చిన హామీని నెరవేర్చకపోవడం, అవిశ్వాసంపై పార్లమెంటులో చర్చించనందుకు నిరసనగా దీక్ష చేస్తారు.
బ్లాక్ డే పాటించాలి
బుధవారం ప్రత్యేక హోదా సాధనా సమితి నేత చలసాని శ్రీనివాస్ ఆధ్వర్యంలో విజయవాడలో ఆ సమితి నేతలు భేటీ అయ్యారు. ప్రత్యేక హోదాపై కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా ఈ నెల 16వ తేదీన బ్లాక్ డే పాటించాలని నిర్ణయించారు.
బంద్ చేపట్టాలని నిర్ణయం
ఆ రోజు రాత్రి ఏడు నుంచి ఏడున్నర వరకు ఏపీలోని అన్ని ఇళ్లు, కార్యాలయాల్లో దీపాలు ఆర్పి నిరసన చేపట్టాలని సమితీ సభ్యులు పిలుపునిచ్చారు. ఆ రోజు ఏపీ బంద్ చేపట్టాలనే అంశంపై కూడా చర్చించారు. ఈ విషయమై పలు పార్టీలు, సంఘాలతో మరింత చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు.
మోడీ దీక్షపై చంద్రబాబు విమర్శలు
మరోవైపు, ప్రధాని నరేంద్ర మోడీ దీక్షపై చంద్రబాబు విమర్శలు గుప్పించారు. కర్నాటక ఎన్నికల కోసం కావేరీ బోర్డు ఏర్పాటు చేయకుండా అన్నాడీఎంకేతో ప్రధాని నరేంద్ర మోడీ గొడవ చేయించారని ఆరోపించారు. అవినీతి ప్రక్షాళణ చేస్తామని చెప్పిన మోడీ ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లాంటి అవినీతి పార్టీతో జత కడుతున్నారన్నారు.
వెంకటేశ్వర స్వామి సాక్షిగా
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి సాక్షిగా మోడీ చేసిన వాగ్ధానాలను ఈ నెల 30న తాము తిరుపతి సభలో వినిపిస్తామని చంద్రబాబు చెప్పారు. వారు తప్పు చేసి మనం తప్పు చేసినట్లు చిత్రీకరించే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. మోడీ దీక్ష చేస్తానని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ 25 లోకసభ స్థానాల్లో గెలవాలని, అప్పుడే కేంద్రం మన మాట వింటుందన్నారు.