మోడీని చిక్కుల్లోకి నెట్టేలా స్కెచ్, ద్విముఖ వ్యూహం: బీజేపీ నేతలకు బాబు వల!
అమరావతి/న్యూఢిల్లీ: అవిశ్వాస తీర్మానంపై శుక్రవారం చర్చ జరగనున్న నేపథ్యంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలోని పరిణామాలను గమనిస్తున్నారు. టీడీపీ అధిష్టానం నిత్యం ఎంపీలతో టచ్లో ఉంటోంది. మోడీ ప్రభుత్వాన్ని సాధ్యమైనంత మేర చిక్కుల్లోకి నెట్టేలా చంద్రబాబు చకచకా పావులు కదుపుతున్నారు.
నాడు సోనియా, నేడు చంద్రబాబు: ఇదీ బలాల లెక్క.. మోడీ ప్రభుత్వానికి ముప్పులేదా?
ఇందుకు కాంగ్రెస్సేతర, బీజేపీయేతర పార్టీలతో సంప్రదింపులు జరపడంతో పాటు బీజేపీలోని అసంతృప్తులపై కూడా దృష్టి సారించారని తెలుస్తోంది. తద్వారా మోడీ ప్రభుత్వాన్ని ఎంత మేరకు అయితే అంతమేర చిక్కుల్లోకి నెట్టాలని చంద్రబాబు భావిస్తున్నారని తెలుస్తోంది. ఎన్డీయేకు స్పష్టమైన మెజార్టీ ఉంది. ఎన్డీయేలోని పార్టీలో వారితో కూడా చర్చించి ఎంతదాకైనా వెళ్లేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది.
మోడీపై చంద్రబాబు ద్విముఖ వ్యూహం
నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు చంద్రబాబు ద్విముఖ వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. ఒకటి.. అవిశ్వాసం కోసం జాతీయస్థాయిలో పార్టీల మద్దతు కోరడం. అందుకోసం వివిధ అంశాలను ఉపయోగించుకోవడం. మోడీపై అసంతృప్తితో ఉన్న శివసేన వంటి పార్టీలను కూడా తమవైపు తిప్పుకోవడం. అలాగే, బీజేపీలో కూడా అసంతృప్తితో నేతలతో మాట్లాడాలని భావిస్తున్నారు. తద్వారా సాధ్యమైనంత మేర మోడీని ఇరుకున పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక రెండోది.. ఏపీకి కేంద్రం ఇచ్చిన ప్రతి అంశంలో సరైన కౌంటర్ ఇచ్చేందుకు సన్నద్ధమవుతున్నారు.
టీడీపీ ఎంపీల జాబితాపై కసరత్తు
అవిశ్వాసం చర్చకు వచ్చిన విషయం తెలియగానే చంద్రబాబు చకచకా పావులు కదుపుతున్నారు. మోడీ లేదా బీజేపీ వ్యతిరేకులను ఏకతాటి పైకి తీసుకు రావాలని భావిస్తున్నారు. వారికి రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని వివరించనున్నారు. బీజేపీ అసంతృప్తుల మద్దతు కోసం పలువురు టీడీపీ ఎంపీలు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అలాగే, అవిశ్వాసంపై మాట్లాడే ఎంపీల జాబితాను చంద్రబాబు సాయంత్రానికి సిద్ధం చేయనున్నారని తెలుస్తోంది.
ఎంపీలకు సమగ్ర సమాచారం ఇవ్వాలని ఆదేశం
అవిశ్వాసం విషయంలో చంద్రబాబు, టీడీపీ చాలా సీరియస్గా ఉంది. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై వివరించడంతో పాటు బీజేపీ వేసే పలు ప్రశ్నలకు గట్టి సమాధానం ఇచ్చేందుకు కూడా టీడీపీ సిద్ధమవుతోంది. ప్రత్యేక హోదా, విభజన సమస్యలపై సమగ్ర సమాచారాన్ని ఎంపీలకు అందచేయాలని ప్రభుత్వ పెద్దలకు ఆదేశాలు జారీ చేశారు.
రాష్ట్ర సమస్యలు ఫోకస్ అయ్యేలా
ఢిల్లీలోని ఎంపీలతో చంద్రబాబు ఎప్పటికి అప్పుడు సంప్రదింపులు జరుపుతున్నారు. ఉదయం పార్లమెంటు సమావేశాల ప్రారంభానికి ముందు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. దిశా నిర్దేశనం చేశారు. సభ అనంతరం అశోక్ గజపతి రాజుకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో రాష్ట్ర సమస్యలు ఎలా ఫోకస్ కావాలనే దానిపై టీడీపీ దృష్టి సారించింది. ప్రత్యేక హోదాతో పాటు అపరిష్కృతంగా ఉన్న 18 అంశాలను ఎలా ముందుకు తీసుకెళ్లాలనే అంశంపై చర్చిస్తున్నారు.
ప్రత్యేక ప్యాకేజీ సహా అన్నింటికి కౌంటర్లు సిద్ధం!
నాడు ప్రత్యేక ప్యాకేజీకి టీడీపీ ఓకే చెప్పింది. దీనిని బీజేపీ ప్రధానంగా లేవనెత్తే అవకాశముంది. కాబట్టి దీనికి కూడా కౌంటర్లు సిద్ధం చేస్తున్నారు. ఆర్థికలోటు, దుగరాజుపట్నం, రైల్వే జోన్, ప్రత్యేక హోదా తదితర పెండింగ్ అంశాలకు సంబంధించిన లెక్కలను తీస్తున్నారు.
పక్కా సమాచారం, లెక్కలతో మోడీని కార్నర్ చేసేందుకు బాబు కసరత్తు
కేంద్రం తీరును లెక్కలతో తిప్పికొట్టేందుకు చంద్రబాబు ఎంపీలను సిద్ధం చేస్తున్నారు. ఇందుకోసం పక్కా సమాచార సేకరణ చేస్తున్నారు. లెక్కలు తీసేందుకు ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. సీఎస్, ఆర్థిక శాఖ కార్యదర్శి, సీఎంవోలు పాల్గొన్నారు. చట్టంలో కేంద్రం చెప్పిందేమిటి, చేసిందేమిటి అనే అంశాలను పూర్తిగా తీసి టీడీపీ ఎంపీలకు ఇవ్వనున్నారు. ఇదిలా ఉంటగా తమ పార్టీ ఎంపీలకు టీడీపీ విప్ జారీ చేసింది. గురువారం, శుక్రవారం సభకు హాజరు కావాలని పేర్కొంది.