ఏపీలో వేడెక్కిన రాజకీయం- అసెంబ్లీ రద్దుకు చంద్రబాబు డిమాండ్- 48 గంటల గడువు..
ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు రాజకీయాలను ఒక్కసారిగా హీటెక్కిస్తున్నాయి. రాజధానిగా ఎన్నికలకు ముందు ఇచ్చిన మాట తప్పినందుకు నిరసనగా అసెంబ్లీ రద్దు చేసి మరోసారి ప్రజాతీర్పు కోరాలని సీఎం జగన్ కు చంద్రబాబు సవాల్ విసిరారు. 48 గంటల్లో ప్రభుత్వ నిర్ణయం తెలపాలని చంద్రబాబు అల్టిమేటం ఇచ్చారు. టీడీపీ ఎమ్మెల్యేల రాజీనామాలు కోరుతున్నారని, సమస్య పరిష్కారమవుతుందంటే దానికీ సిద్దమేనన్నారు.
Recommended Video
అమరావతిపై రెఫరెండం ? తొందరపడి రాజీనామాలొద్దు- జగన్, పవన్కు రఘురామ సూచనలు..
రాజధానిపై మాట తప్పారు
గతేడాది అసెంబ్లీ ఎన్నికలకు ముందు అమరావతే రాజధానిగా ఉంటుందని చెప్పిన వైసీపీ నేతలు ఎన్నికల్లో గెలిచాక మూడు రాజధానులు అంటున్నారని, ప్రజలను వెన్నుపోటు పొడిచిన అధికార పార్టీ మరోసారి ప్రజాతీర్పు కోరాలని టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు రాజధాని అమరావతిలోనే ఉంటుందని ప్రజలకు వైసీపీ హామీ ఇచ్చిన విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు. గతంలో ఆ పార్టీ నేతలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, బొత్స సత్యనారాయణ, వసంత కృష్ణప్రసాద్ రాజధానిపై ఏం మాట్లాడారో గుర్తు చేసుకోవాలని చంద్రబాబు సూచించారు. విశ్వసనీయత గురించి పదే పదే మాట్లాడే వైసీపీ నేతలు ఇప్పుడు మాటతప్పి ప్రజలకు వెన్నుపోటు పొడుస్తున్నారని చంద్రబాబు విమర్శించారు.
అసెంబ్లీ రద్దుకు 48 గంటల గడువు...
అమరావతిలోనే రాజధాని ఉంటుందని గతంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోని వైసీపీ ప్రభుత్వం తిరిగి అసెంబ్లీని రద్దు చేసి ప్రజాతీర్పు కోరారని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఎన్నికల్లో వైసీపీ గెలిస్తే ప్రభుత్వ వాదనను ప్రజలు అంగీకరించినట్లు తాము గుర్తిస్తామన్నారు. అసెంబ్లీ రద్దు కోసం ప్రభుత్వానికి 48 గంటల గడువు ఇస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. 48 గంటల్లోగా రాజధానిపై నిర్ణయం వెనక్కి తీసుకోవడం లేదా అసెంబ్లీ రద్దు చేసి తిరిగి ప్రజా తీర్పు కోరాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఇది ఏ ఒక్క వ్యక్తి లేదా పార్టీ సమస్య కాదని, ఐదు కోట్ల ప్రజల సమస్య అని చంద్రబాబు తెలిపారు.
రాజీనామాలకు టీడీపీ సిద్దం...
అమరావతి రాజధాని కోరుతున్న టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయాలని వైసీపీ డిమాండ్ చేయడంపై చంద్రబాబు మండిపడ్డారు. టీడీపీ ఎమ్మెల్యేలతో రాజీనామాలతో సమస్య పరిష్కారం అవుతుందంటే వెంటనే రాజీనామాలు చేసేందుకు తాము సిద్దంగా ఉన్నట్లు చంద్రబాబు ప్రకటించారు. అయితే టీడీపీతో పాటు వైసీపీ కూడా రాజీనామాలు చేయకుండా ఏకంగా అసెంబ్లీనే రద్దు చేయాలని, అప్పుడే సమస్యకు పరిష్కారం లభిస్తుందని చంద్రబాబు పేర్కొన్నారు. తిరిగి ప్రజా తీర్పు కోరడం ద్వారా ప్రజలు ఎవరిని విశ్వసిస్తున్నారనే విషయం తేలిపోతుందన్నారు.