విజయవాడ అభివృద్ధి చెందకపోవడానికి కారణమదే!: చంద్రబాబు
గన్నవరం ఎయిర్ పోర్టును రేకుల షెడ్డు దశ నుంచి అంతర్జాతీయ స్థాయికి తీసుకొచ్చామని చంద్రబాబు అన్నారు.
: అభివృద్ధి పనులు చేపట్టాలంటే భూమి కావాలని.. భూమి కొరత వల్లే విజయవాడ ఇంకా విజయవాడ అభివృద్ధి చెందలేకపోయిందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు.
బుధవారం నాడు కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, అశోక్ గజపతిరాజు, బండారు దత్తాత్రేయలతో కలిసి గన్నవరం ఎయిర్ పోర్ట్ లో నూతన అంతర్జాతీయ టెర్మినల్ ను సీఎం ప్రారంభించారు. అనంతరం రన్వే విస్తరణ పనులకు కూడా భూమి పూజ నిర్వహించారు.
ఈ సందర్బంగా చంద్రబాబు పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గన్నవరం ఎయిర్ పోర్టును రేకుల షెడ్డు దశ నుంచి అంతర్జాతీయ స్థాయికి తీసుకొచ్చామని చంద్రబాబు అన్నారు. నూతన ఎయిర్ పోర్ట్ టెర్మినల్ ను ప్రారంభించడం ఆనందంగా ఉందని తెలిపారు.
జిల్లాకు ఒక విమానాశ్రయం రావాలన్నదే తమ కల అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. గన్నవరం నుంచి మచిలీపట్నానికి రోడ్డు వేస్తే పోర్టుకు కనెక్టివిటీ వస్తుందని అన్నారు. అభివృద్ధికి అడ్డుపడేవారి మాటలు రైతులు వినవద్దని ఈ సందర్బంగా చంద్రబాబు చెప్పుకొచ్చారు. రైతులు భూములు ఇస్తే విస్తరణ పనులు చేపడుతామని అన్నారు.