జగన్ పాపాలు పోవాలని పాదయాత్ర చేస్తున్నారు, కరెంట్ ఛార్జీలు తగ్గిస్తాం: బాబు
ఏలూరు: పాపాలు పోవాలని ప్రతిపక్ష నేత వైయస్ జగన్ పాదయాత్ర చేస్తున్నారని సీఎం చంద్రబాబు నాయుడు ఎద్దేవా చేశారు. పోలవరంపై ఇష్టానుసారం మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టును అడ్డుకోవాలని వైసీపీ ప్రయత్నించిందన్నారు.
Recommended Video
రాష్ట్రంలో నదులు అనుసంధానం చేపట్టి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. గోదావరి, పెన్నా, నాగావళి, వంశధార నదులు అనుసంధానం వల్ల రాష్ట్రానికి సాగు, తాగునీటి కొరత తీరడమే కాకుండా పరిశ్రామికంగా అభివృద్ధి చెందుతుందన్నారు.
సోమవారం పోలవరం ప్రాజెక్టును సందర్శించిన ఆయన పనుల ప్రగతిని పరిశీలించారు. అగ్రిగేట్ కూలింగ్ ప్లాంట్ను ప్రారంభించారు. ఎగువ కాపర్ డ్యామ్ జట్ గ్రౌటింగ్ పనులకు పూజలు నిర్వహించారు. స్పిల్వే, ఎగువ కాపర్ డ్యామ్, డయాఫ్రం వాల్, గేట్ల తయారీ పనులను పరిశీలించారు. పనుల ప్రగతిని ఇంజనీర్లను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ, వైసీపీ పోలవరం ప్రాజెక్టును అడ్డుకోవడానికి విశ్వప్రయత్నం చేస్తున్నాయన్నారు. ప్రజలను రెచ్చగొట్టే ధోరణితోనే కాంగ్రెస్ పార్టీ పాదయాత్ర చేపట్టిందన్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు వద్ద పనులు వేగం పుంజుకున్నాయన్నారు.
కొత్త అగ్రిగేటర్ కూలింగ్ ప్లాంట్ వల్ల రోజుకు 5000 వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు చేయడానికి వీలవుతుందని వెల్లడించారు. ఈ ప్లాంట్ వల్ల స్పిల్వే, స్పిల్ ఛానల్ పనులు పుంజుకుంటాయన్నారు.
డయాఫ్రం వాల్ పనులు అనుకున్న లక్ష్యం మేరకు సాగుతున్నాయన్నారు. రాష్ట్రంలో 29 సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయడానికి లక్ష్యం నిర్దేశించుకోగా ఇప్పటికి 9 ప్రాజెక్టులు పూర్తి చేశామన్నారు. మరో 8 ప్రాజెక్టులు నిర్మాణ దశలో ఉన్నాయన్నారు. కరెంట్ ఛార్జీలు తగ్గిస్తాం తప్ప పెంచే ప్రసక్తి లేదన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే గోదావరి జిల్లాల్లో మెట్ట ప్రాంతం సస్యశ్యామలం అవుతుందన్నారు.