నియంత పాలనతో సీఎం జగన్ కాలగర్భంలో కలవడం ఖాయం : చంద్రబాబు
టీడీపీ నేతల గృహనిర్భంధాలను ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఖండించారు. అమరావతిలోని ధర్నాచౌక్కు వెళ్లకుండా పార్టీ నేతలైన విజయవాడ ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్సి బుద్దా వెంకన్నతో పాటు ఇతర పార్టీ నేతలను గృహనిర్భంధం చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసు చర్యలతో అమరావతి ప్రాంత ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని దుయ్యబట్టారు. ఈ నేపథ్యంలోనే అమరావతి ప్రాంతాన్ని పోలీసు రాజ్యంగా చేశారని ఆయన విమర్శించారు.
ఐదేళ్లుగా ప్రజలు కూడగట్టుకున్న ప్రజల ఆశలను ప్రభుత్వం వివాదస్పదం చేస్తుందనిఆయన మండిపడ్డారు. ఈనేపథ్యంలనే రాజధాని పేరుతో ప్రాంతాల మధ్య చిచ్చుపెడుతున్నారని ఆరోపణలు చేశారు. కాగా రాజధాని మార్పుపై ప్రజాభిప్రాయం చెప్పే స్వేచ్చలేకుండా చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. రాజధాని తరలింపు ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయాలతో ఆపార్టీ పతనం కాక తప్పదని ఆయన హెచ్చరించారు. ప్రజాగ్రహం ముందు సీఎం జగన్ లాంటీ నియంత పాలకులు కాలగర్భంలో కలిశారని అన్నారు.