బాబుది నోరేనా? మోడీ-జగన్ ఎలా చేస్తే అలా, 2019లో కచ్చితంగా గెలవరు: విష్ణు షాకింగ్
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై బీజేపీ శాసన సభా పక్ష నేత విష్ణు కుమార్ రాజు ఆదివారం తీవ్రంగా మండిపడ్డారు. ఒకరిని కాపీ కొట్టడమే చంద్రబాబుకు తెలుసునని, ఆయన ఏదీ సొంతగా ఆలోచించరని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేతపై ఆయన తీవ్ర వ్యాఖ్యలే చేశారు.
నిరంకుశంగా: మోడీపై మురళీమోహన్, సత్తా చూపిద్దాం: జేసీ, 'వివేకా తర్వాత పులివెందులలో జగన్ షాకిస్తాం!'
చంద్రబాబుది నోరా లేకపోతే అరిగిపోయిన టేప్ రికార్డరా అని ధ్వజమెత్తారు. కేంద్రం చేసిన సాయంపై గతంలో ప్రశంసలు కురిపించారన్నారు. ఇప్పుడు హఠాత్తంగా అసెంబ్లీలో కూడా అన్నీ అబద్దాలే చెప్పారని మండిపడ్డారు. కేంద్రంలో తాము మద్దతిచ్చే పార్టీయే అధికారంలోకి వస్తుందనడం విడ్డూరం అన్నారు.
2019లో చక్రం తిప్పడానికి వేలు ఉంటే కదా
2019 సార్వత్రిక ఎన్నికల్లో చక్రం తిప్పడానికి తెలుగుదేశం పార్టీకి వేలు ఉంటే కదా అని విష్ణు కుమార్ రాజు అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ కచ్చితంగా అధికారంలోకి రాదని తేల్చి చెప్పారు. అన్ని విషయాలలో ఇతరులను కాపీ చేయడమే చంద్రబాబు పని అని ఎద్దేవా చేశారు.
మోడీ దీక్ష చేశారని దీక్ష, జగన్ హోదా గురించి మాట్లాడితే అదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దీక్ష చేశారని, ఇప్పుడు చంద్రబాబు ఈ నెల 20న దీక్ష అంటున్నారని విష్ణు కుమార్ రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓట్లు, రాజకీయం కోసమే ఆయన దీక్ష అంటున్నారన్నారు. అందరినీ ఫాలో అవడం, కాపీ కొట్టడమే చంద్రబాబు పని అన్నారు. సొంతగా ఆలోచించేది లేదన్నారు.
ఫోటో షూట్ కోసమే పార్లమెంటుకు మొక్కారు
ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డిని కాపీ కొట్టారని, దీక్ష విషయంలో ప్రధాని మోడీని అనుసరిస్తున్నారని విష్ణు కుమార్ రాజు ఎద్దేవా చేశారు. ఫోటో షూట్ కోసమే చంద్రబాబు ఆనాడు పార్లమెంటుకు మొక్కారని చెప్పారు.
వారిని ఫాలో అవుతున్న చంద్రబాబు
కాగా, ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో టీడీపీ, బీజేపీ మధ్య గత కొన్నాళ్లుగా మాటల యుద్ధం నడుస్తోన్న విషయం తెలిసిందే. జగన్, పవన్ కళ్యాణ్లు మొదటి నుంచి ప్రత్యేక హోదా అంటున్నారు. దీంతో మొదట ప్యాకేజీకి అంగీకరించిన చంద్రబాబు ఆ తర్వాత హఠాత్తుగా హోదా అన్నారు. ఇటీవల మోడీ దీక్ష చేశారు. ఇప్పుడు ఆయన కూడా దీక్ష చేస్తున్నారు.