బంగారు గుడ్డు పెట్టే బాతును చంపేశారు: రూ.2 లక్షల కోట్లు వచ్చేవి, అమరావతిపై చంద్రబాబు..
వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. గత ప్రభుత్వ విధానాలనే విమర్శించడం పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. అమరావతి రాజధాని నిర్మాణం నుంచి సింగపూర్ ప్రభుత్వం వెళ్లడం పెద్ద బ్యాక్ డ్రాప్అన్నారు. రాజధాని నిర్మాణంపై జగన్ సర్కార్ వైఖరి సరిగాలేదని దుయ్యబట్టారు. ఇసుక కొరతతో భవన నిర్మాణ కార్మికులు ఇంకా ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. బుధవారం తణుకులో చంద్రబాబు మీడియాతో మాట్లాడారు.
మేమే నంబర్వన్
టీడీపీ హయాంలో ఈజ్ ఆఫ్ డూయింగ్, నదుల అనుసంధానం, సంపద సృష్టించడంలో నంబర్వన్గా నిలిచిందని చంద్రబాబు తెలిపారు. టూరిజం అభివృద్ధికి పాటుపడిందని చెప్పారు. కానీ వైసీపీ సర్కార్ ఏమీ చేయలేదని ఆరోపణలు చేస్తుందని మండిపడ్డారు.
బంగారు బాతే
అమరావతి రాజధాని నిర్మాణం ప్రపంచానికే ఆదర్శమైన ప్రాజెక్టు అని చంద్రబాబు తెలిపారు. రైతుల నుంచి 35 వేల ఎకరాల భూమి సేకరించామని పేర్కొన్నారు. ప్రభుత్వం 20 వేల ఎకరాలతో కలిపి.. మొత్తం 55 వేల ఎకరాలు సమీకరించామని చెప్పారు. భవన నిర్మాణ సముదాయాలు పూర్తయితే 10 వేల ఎకరాలు మిగులుతుందని చెప్పారు. వాటిని ఇప్పటి ధరకు విక్రయించినా లక్ష నుంచి రెండు లక్షల కోట్ల వస్తాయని చెప్పారు. అందులో 500 ఎకరాలను ఇళ్ల కోసం కేటాయించొచ్చని సూచించారు.
అనాసక్తి..
సింగపూర్ ప్రభుత్వమే వెళ్లినందున భవిష్యత్లో ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఏ కంపెనీలు ముందుకురావని అభిప్రాయపడ్డారు. భారతదేశానికి వస్తాయి.. కానీ ఏపీకి మాత్రం రావన్నారు. రాజధాని నిర్మాణం నుంచి సింగపూర్ వెళ్లడం జగన్ మూర్ఖత్వానికి నిదర్శనం అని చంద్రబాబు ధ్వజమెత్తారు.
ఇసుక కొరత
ఇసుక వారోత్సవాలతో రాష్ట్రంలో ఇసుక కొరత తీరిందా అని చంద్రబాబు ప్రశ్నించారు. ఇప్పుడు ఏపీలో ఇసుక దొరుకుతుందా అని ప్రశ్నించారు. కాసేపటి క్రితమే కొందరు భవన నిర్మాణ కార్మికులు తనకు మెమోరాండం ఇచ్చారని గుర్తుచేశారు. రాష్ట్రంలో ఇసుకు మాఫియా రెచ్చిపోతుందని తెలిపారు. భవన నిర్మాణ కార్మికుల బతుకులు ఆగమైపోయాయని చెప్పారు.