సబ్జెక్ట్ మాట్లాడండి.. రౌడీయిజం కాదు: బాబు, 'సభలో ఇలానా? డబ్బులు వసూలు చేయండి'
సభలో సబ్జెక్ట్ గురించి మాట్లాడాలని, తప్పులుంటే తాము సరిచేస్తామని, అంతేగానీ అనవసర విమర్శలు చేయవద్దని హితవు పలికారు.
అమరావతి: ఏపీ అసెంబ్లీలో గందరగోళానికి తెరపడట్లేదు. వాయిదా అనంతరం ప్రారంభమైన సభలోను ఇదే తీరు కనిపించింది. జలదినోత్సవాన్ని పురస్కరించుకుని సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటన చేస్తున్న సమయంలో ప్రతిపక్ష సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి నిరసన తెలిపారు.
పాయింట్ ఆఫ్ ఆర్డర్ పై తమకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని పట్టుబట్టారు. ప్రతిపక్ష సభ్యుల నిరసనల మధ్యే సీఎం చంద్రబాబు జలదినోత్సవానికి సంబంధించిన ప్రకటన చేశారు. దీనికి సంబంధించి శాసన సభ్యుల చేత సీఎం పృతిజ్ఞ చేయిస్తున్న సమయంలో ప్రతిపక్ష సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు.
జల ప్రతిజ్ఞ:
వైసీపీ సభ్యులు సభ నుంచి వెళ్లిపోవడంతో.. ప్రతిపక్ష సభ్యులు లేకుండానే అధికార పార్టీ శాసన సభ్యుల చేత సీఎం జల ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం వైసీపీ సభ్యుల తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిజ్ఞ సమయంలో సభ్యులు సభ నుంచి వెళ్లిపోవడం బాధాకరం అన్నారు. ప్రశాంతమైన వాతావరణంలో చర్చలు జరిగినప్పుడే ప్రజా సమస్యలు పరిష్కరమవుతాయన్నారు.
వైసీపీ ఎమ్మెల్యేలకు ఆ ఆలోచనే లేదు:
వైసీపీ సభ్యుల తీరును తప్పుపడుతూ.. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు సభలో ఎన్నడూ నీళ్ల అంశాన్ని ప్రస్తావించలేదని సీఎం చంద్రబాబు గుర్తుచేశారు. వైసీపీ ఎమ్మెల్యేలు గానీ, అధినేత జగన్ గానీ ఎప్పుడైనా నీళ్లు కావాలని అడిగారా? అంటూ ప్రశ్నించారు. కనీసం ఒక్క చెరువులో పూడిక తీయాలన్న ఆలోచన వచ్చిందా? ఎమ్మెల్యేలుగా ఆమాత్రం బాధ్యత లేదా? అంటూ వైసీపీ సభ్యులను నిలదీశారు.
సబ్జెక్ట్ మాట్లాడండి:
ప్రభుత్వాన్ని అడుగడుగునా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని, సీఎంగా ఉన్న వ్యక్తి మీదే విమర్శలకు దిగడం రౌడీయిజం కాదా? అని ప్రశ్నించారు. సభలో సబ్జెక్ట్ గురించి మాట్లాడాలని, తప్పులుంటే తాము సరిచేస్తామని, అంతేగానీ అనవసర విమర్శలు చేయవద్దని హితవు పలికారు. మేం చెప్పిందే వేదం, మేం ఏమన్నా పడాలి అన్న తరహాలో వితండ వాదం చేయడం సరికాదన్నారు.
రెచ్చగొట్టాలనుకున్నారు..:
అదే సమయంలో మొన్నామధ్య విశాఖలో జరిగిన పారిశ్రామిక సదస్సు గురించి చంద్రబాబు ప్రస్తావించారు. ఓవైపు 40దేశాలకు చెందిన పెట్టుబడిదారులంతా సీఐఐ సదస్సుకు వస్తే.. ప్రత్యేక హోదా పేరుతో ప్రతిపక్షం అక్కడ ఆందోళనలు చేసిందని, ఇది రాష్ట్రానికి నష్టానికి చేకూర్చే చర్య అని చంద్రబాబు మండిపడ్డారు. జల్లికట్టు స్పూర్తి అని చెబుతూ అక్కడికొచ్చి ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని అన్నారు.
స్పీకర్ హెచ్చరిక:
సీఎం చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తున్న సమయంలో వైసీపీ సభ్యులు సభలో గందరగోళం రేపడాన్ని స్పీకర్ తప్పుపట్టారు. సీఎం మాట్లాడిన తర్వాత ప్రతిపక్ష సభ్యులకు మాట్లాడే అవకాశం ఇస్తామని అన్నారు. సభలో ఇలాగే గందరగోళం సృష్టిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. స్పీకర్ పట్ల, సీఎం పట్ల వైసీపీకి గౌరవం లేదని అన్నారు.
రెడ్ లైన్ దాటితే సస్పెండ్ చేయండి:
వైసీపీ సభ్యుల నిరసనను తప్పుపడుతూ స్పీకర్ పోడియం చుట్టూ ఇకనుంచి రెడ్ లైన్ ఏర్పాటు చేయాలని ఆర్థిమంత్రి యనమల రామకృష్ణుడు సూచించారు. ఆ రెడ్ లైన్ దాటితే సభ్యులను సభ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. పార్లమెంటులో ఉన్న ఆటోమేటిక్ సస్పెన్షన్ చట్టాన్ని అసెంబ్లీలోను అమలు చేయాలని కోరారు.
వైసీసీ సభ్యులు పదే పదే నిరసన పేరుతో సభకు అడ్డుపడటం సరికాదన్నారు. ఇలాగే వ్యవహరిస్తే వారిపై చర్యలు తప్పవని అన్నారు. సభలో నిరసనతో గందరగోళం రేపి విలువైన సమయాన్ని వృథా చేస్తున్నారని అన్నారు. సమయం వృథా చేస్తున్నందుకు సభా నిర్వహణ ఖర్చులను వారి నుంచే వసూలు చేయాలని డిమాండ్ చేశారు.