బాబుతో చల్లా భేటీ: సివిల్ సప్లయీస్ కార్పోరేషన్ ఛైర్మెన్ పదవి, మెత్తబడ్డట్టేనా?
Recommended Video
అమరావతి:మాజీ ఎమ్మెల్యే చల్లా రామకృష్ణారెడ్డి కొంత మెత్తబడినట్టుగా కన్పిస్తున్నారు. ఏపీలో సివిల్ సప్లయీస్ కార్పోరేషన్ ఛైర్మెన్ పదవిని చల్లా రామకృష్ణారెడ్డికి కేటాయించే అవకాశం ఉందని టిడిపి వర్గాలు చెబుతున్నాయి. కడప రీజీనల్ ఆర్టీసీ ఛైర్మెన్ పదవి ఇవ్వడంపై చల్లా రామకృష్ణారెడ్డి తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. దీంతో ఆయన త్వరలోనే అనుచరులతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్నట్టు ప్రకటించారు. ఈ తరుణంలో సీఎంతో చల్లా రామకృష్ణారెడ్డి సమావేశం కావడంతో మెత్తబడినట్టు తెలుస్తోంది.
ఇటీవల కాలంలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం 17 కార్పోరేషన్ చైర్మెన్ పదవులను భర్తీ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మాజీ ఎమ్మెల్యే చల్లా రామకృష్ణారెడ్డికి కడప రీజినల్ ఆర్టీసీ ఛైర్మెన్ పదవిని ఇవ్వడంపై ఆయన అసంతృప్తితో ఉన్నారు. ఈ పదవిని తీసుకోలేదు. తాడో పేడో తేల్చుకొంటానని ఆయన ప్రకటించారు.
తన సోదరుడి కొడుకు వివాహాం తర్వాత భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్నట్టు ప్రకటించారు.ఈ తరుణంలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడుతో చల్లా రామకృష్ణారెడ్డి భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకొంది.
నాకిచ్చే గౌరవం ఇదేనా, దూతను పంపారు, భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తా: చల్లా
చల్లాకు సివిల్ సప్లయి కార్పోరేషన్ ఛైర్మెన్ పదవి
మాజీ ఎమ్మెల్యే చల్లా రామకృష్ణారెడ్డికి సివిల్ సప్లయీస్ కార్పోరేషన్ ఛైర్మెన్ పదవిని ఇవ్వనున్నట్టు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారని టిడిపి వర్గాల్లో ప్రచారం సాగుతోంది. నామినేటేడ్ పదవుల పంపకం విషయంలో అసంతృప్తిగా ఉన్న చల్లా రామకృష్ణారెడ్డి ఏపీ సీఎం చంద్రబాబునాయుడుతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఇటీవల చోటు చేసుకొన్న పరిణామాలపై ఇద్దరి మధ్య చర్చ జరిగిందని సమాచారం. సివిల్ సప్లయీస్ కార్పోరేషన్ ఛైర్మెన్ పదవిని చల్లాకు ఇస్తానని ఈ సమావేశంలో చంద్రబాబునాయుడు చల్లా రామకృష్ణారెడ్డికి హమీ ఇవ్వడంతో కొంత మెత్తబడ్డారని సమాచారం.రెండు మూడు రోజుల్లో ఈ మేరకు అధికారికంగా ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
చల్లాకు టిడిపి బుజ్జగింపులు
ఆర్టీసీ కడప రీజీనల్ ఛైర్మెన్ కేటాయించడంపై చల్లా రామకృష్ణారెడ్డి టిడిపి నాయకత్వంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ పదవిని తీసుకోబోనని ప్రకటించారు. గతంలో ఎమ్మెల్యేగా పని చేసిన తనకు రీజినల్ ఆర్టీసీ ఛైర్మెన్ పదవి ఇవ్వడం ఓటమి పాలైన వర్ల రామయ్యకు ఆర్టీసీ ఛైర్మెన్ పదవి ఇవ్వడంపై ఆయన బహిరంగంగానే వ్యాఖ్యలు చేశారు. దీంతో చంద్రబాబునాయుడు చల్లా రామకృష్ణారెడ్డితో మాట్లాడేందుకు ప్రయత్నించినా ఆయన తొలిరోజు ఫోన్ తీయలేదు. ఆ తర్వాత అమరావతి నుండి సీఎం ప్రత్యేక దూతను చల్లా రామకృష్ణారెడ్డి వద్దకు పంపారు. చల్లా రామకృష్ణారెడ్డితో ఆయన చర్చించారు. దీంతో చల్లా రామకృష్ణారెడ్డి చంద్రబాబుతో సమావేశమయ్యారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఎమ్మెల్సీ పదవి దక్కలేదు
2014 ఎన్నికలకు ముందు చల్లా రామకృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి టిడిపిలో చేరారు. గతంలో తాను ప్రాతినిథ్యం వహించిన స్థానంలో టిడిపి అభ్యర్ధి విజయం కోసం కృషి చేశారు.టిడిపిలో చేరే సమయంలోనే ఎమ్మెల్సీగా అవకాశం కల్పించనున్నట్టు చంద్రబాబునాయుడు చల్లా రామకృష్ణారెడ్డికి హమీ ఇచ్చారని ఇటీవల ఆయనే మీడియా సమావేశంలో ప్రకటించారు. అయితే ఈ హమీని ఇంతవరకు అమలు చేయలేకపోయారు. మొదటి నుండి పార్టీలో ఉన్నవారితో పాటు రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఎమ్మెల్సీగా ఇతరులకు అవకాశాలు కల్పించాల్సిన పరిస్థితులు బాబుకు నెలకొన్నాయి. దీంతో చల్లా రామకృష్ణారెడ్డికి ఎమ్మెల్సీ పదవి దక్కలేదు. ఇటీవలనే మాజీ మంత్రి కెఈ ప్రభాకర్కు ఎమ్మెల్సీ అవకాశం దక్కింది. ఆ సమయంలో చల్లా రామకృష్ణారెడ్డి పేరు చివరివరకు విన్పించింది.
టిడిపిని చల్లా వీడకుండా జాగ్రత్తలు
మాజీ ఎమ్మెల్యే చల్లా రామకృష్ణారెడ్డి టిడిపిని వీడకుండా ఆ పార్టీ నాయకత్వం జాగ్రత్తలు తీసుకొంటుంది. నామినేటేడ్ పదవుల విషయంలో అసంతృప్తితో ఉన్న చల్లా రామకృష్ణారెడ్డిని పార్టీ నాయకత్వం బుజ్జగించిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ మేరకు చల్లా రామకృష్ణారెడ్డిని ఏపీ సీఎం చంద్రబాబునాయుడుతో సమావేశమయ్యేలా చేయడంలో కొందరు నేతలు చేసిన ప్రయత్నాలు సక్సెస్ అయ్యాయని పార్టీ వర్గాలు అభిప్రాయంతో ఉన్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ముఖ్యమైన నేతలను దూరం చేసుకొంటే రాజకీయంగా నష్టమనే అభిప్రాయంతో చల్లా విషయంలో టిడిపి నాయకత్వం జాగ్రత్తలు తీసుకొందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.