రాష్ట్రపతి కాకముందే బాబు డిమాండ్లు!: చిరంజీవి సహా నలుగురు మినహా..
ఎన్డీయే అభ్యర్థి రామ్నాథ్ కోవింద్ రాష్ట్రపతి కాకముందే ఏపీ సీఎం, టిడిపి జాతీయ అధ్యక్షులు ఆయన ముందు పలు డిమాండ్లు పెట్టారు!
అమరావతి: ఎన్డీయే అభ్యర్థి రామ్నాథ్ కోవింద్ రాష్ట్రపతి కాకముందే ఏపీ సీఎం, టిడిపి జాతీయ అధ్యక్షులు ఆయన ముందు పలు డిమాండ్లు పెట్టారు!
విభజన నేపథ్యంలో నవ్యాంధ్ర చాలా కష్టాల్లో ఉందని, ఎన్నో సమస్యలను ఎదుర్కొంటోందని కోవింద్ దృష్టికి చంద్రబాబు తీసుకు వచ్చారు.
నవ్యాంధ్రను నిర్మించుకునే పనిలో ఉన్నామని, మీ నుంచి తమకు పూర్తి సహకారం అవసరమని కోవింద్ను ఈ సందర్భంగా కోరారు. ఏపీ మూడేళ్ల చిన్నారి అని, రాజధాని అమరావతిని నిర్మించుకునే ప్రక్రియలో ఉన్నామన్నారు.
ఇటీవల ఎంపిక చేసిన స్మార్ట్ సిటీల జాబితాలో అమరావతికి చోటు కల్పించినందుకు కేంద్రమంత్రి వెంకయ్య నాయుడుకు చంద్రబాబు ధన్యవాదాలు చెప్పారు. ఏపీకి చేయడానికి ఎక్కడ ఏ చిన్న అవకాశం ఉన్నా వెంకయ్య వదలడం లేదనే విషయాన్ని కోవింద్కు చంద్రబాబు తెలిపారు.
ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఎంతో సహకరిస్తున్నారని చంద్రబాబు అన్నారు. కొత్త రాష్ట్రం కావడం వల్లే ఇన్ని ఇబ్బందులు ఉన్నాయన్నారు. ఏపీ నుంచి ఒక్క ఓటు కూడా మురిగిపోదని, ఏపీలో ఉన్న మొత్తం ఓట్లు మీకే పడతాయన్నారు.
కాగా, రాష్ట్రపతి ఎన్నికల్లో ఏపీలో అధికార టిడిపి, ప్రతిపక్ష వైసిపిలు ఎన్డీయే అభ్యర్థి రామ్ నాథ్ కోవింద్కే ఓటు వేయనున్నాయి. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ ఓట్లలో కేవలం కాంగ్రెస్ పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు మాత్రమే యూపీఏ అభ్యర్థి మీరా కుమార్కు ఓటు వేయనున్నారు. కాంగ్రెస్ ఎంపీలు చిరంజీవి, సుబ్బిరామి రెడ్డి, రేణుకా చౌదరి, ఎంఏ ఖాన్లు మీరా కుమార్ వైపు ఉంటారు.