గొట్టిపాటికి చంద్రబాబు షాక్: కలిసేందుకు సిద్ధం కానీ.. కరణం షరతు
ప్రకాశం జిల్లా అద్దంకి శాసన సభ్యుడు గొట్టిపాటి రవికుమార్కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం షాకిచ్చారు.
అద్దంకి: ప్రకాశం జిల్లా అద్దంకి శాసన సభ్యుడు గొట్టిపాటి రవికుమార్కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం షాకిచ్చారు. ఉదయం ఒంగోలులో కరణం బలరాంతో జరిగిన ఘర్షణ విషయమై సీఎంకు ఫిర్యాదు చేస్తానని గొట్టిపాటి చెప్పారు.
చదవండి: రాజకీయాలు వదిలేస్తా: గొట్టిపాటి, బాబు ఆరా, నేతలు ఫోన్ చేస్తే కరణం ఇలా..
ముఖ్యమంత్రిని నేరుగా కలుస్తానని చెప్పారు. ఇందుకోసం చంద్రబాబు అపాయింటుమెంట్ కూడా కోరారు. కానీ ఆయనకు షాక్ తగిలింది. చంద్రబాబు బిజీగా ఉన్నారని, కలవడం కుదరదని ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు తెలిపారు.
తొలుత అపాయింటుమెంట్ ఇచ్చి..
తొలుత గొట్టిపాటికి మధ్యాహ్నం అపాయింటుమెంట్ ఇచ్చారు. అయితే ఒంగోలు ఘటన తర్వా సీఎం బిజీగా ఉన్నారని సమాచారం అందించారు. సీఎంను కలిసేందుకు గొట్టిపాటి మూడుసార్లు ఫోన్ చేశారు. కానీ కలవలేదు.
దాంతో ముఖ్యమంత్రి అపాయింటుమెంట్ కోసం ఆయన వేచి చూస్తున్నారు. బుధవారం అయినా చంద్రబాబును కలవాలని చూస్తున్నారు. తెలంగాణలో జరిగే టిడిపి మహానాడులో చంద్రబాబు పాల్గొంటారు. అవసరమైతే అక్కడికైనా వెళ్లి కలవాలనుకుంటున్నారు.
గొట్టిపాటికి టిడిపి హైకమాండ్ ఫోన్!
చంద్రబాబు అపాయింటుమెంట్ దక్కనప్పటికీ గొట్టిపాటికి టిడిపి ముఖ్య నేతల నుంచి ఫోన్ వచ్చిందని తెలుస్తోంది. ఒంగోలు ఘటనలో వాస్తవాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎల్లుండి ఒంగోలులో జరిగే మినీ మహానాడుకు వెళ్లాలని ఆదేశించారు. రెండు, మూడు రోజుల్లో సీఎం పిలుస్తారని సమాచారం అందిందని తెలుస్తోంది.
చొక్కాలు చించుకున్నారు
మంగళవారం ఉదయం ప్రకాశం జిల్లాలో టిడిపి అధ్యక్షుడి ఎన్నిక కార్యక్రమంలో ఎమ్మెల్యే గొట్టి పాటి, ఎమ్మెల్సీ కరణం బలరాంల మధ్య తీవ్ర ఘర్షణ జరిగిన విషయం తెలిసిందే. ఒకరినొకరు తోసుకున్నారు. చొక్కాలు చించుకున్నారు. ఈ గొడవలో గొట్టిపాటి కిందపడ్డారు. పోలీసులు, మంత్రుల జోక్యంతో పరిస్థితి సద్దుమణిగింది.
చంద్రబాబు ఆరా, ఆగ్రహం
కరణం, గొట్టిపాటిల మధ్య గొడవపై ముఖ్యమంత్రి చంద్రబాబు పూర్తి సమాచారం తెప్పించుకున్నారు. మంత్రులు, ఇతర నేతల నుంచి విషయం ఆరా తీశారు. దీనిపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని తెలుస్తోంది.
గన్మెన్ల వల్లే గొడవ: కరణం
గొట్టిపాటి రవి కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని కరణం బలరాం అన్నారు. ఆయన మంగళవారం ఉదయం జరిగిన గొడవపై స్పందించారు. రవిది ఎదుటివాళ్లను ఇబ్బందిపెట్టి లబ్ధిపొందాలనుకునే గుణం అని ఆరోపించారు. కావాలనే గొడవ చేశారని, కానీ తనపైనే దాడి చేశారని గొట్టిపాటి చెబుతున్నారన్నారు.
గొట్టిపాటితో కలిసి పని చేసేందుకు సిద్ధం.. కరణం షరతు
గొట్టిపాటి రవి గన్మెన్ రాజశేఖర్ వల్ల గొడవ జరిగిందని కరణం అన్నారు. అతను దురుసుగా ప్రవర్తించాడన్నారు. తెలుగుదేశం పార్టీలో మొదటి నుంచి ఉన్న కార్యకర్తలకు ఇబ్బంది లేకుంటే గొట్టిపాటితో కలిసి పని చేసేందుకు తనకు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పారు.
వివాదాలకు దూరం.. గొట్టిపాటి
తాము వివాదాలకు దూరంగా ఉంటామని, కుటుంబ సభ్యులను కోల్పోయామని ఆ బాధ తమకు తెలుసునని గొట్టిపాటి అన్నారు. అందరితో కలిసి పని చేస్తామని చెప్పారు. ఉదయం ఏం జరిగిందో అందరూ చూశారన్నారు.