మాట్లాడాలా, వద్దా?: కర్ణాటక ఎన్నికలపై చంద్రబాబు డైలమా, అక్కడే చిక్కు!
అమరావతి: కర్ణాటక వ్యవహారంపై తెలుగుదేశం పార్టీ తర్జన భర్జన పడుతోంది. తమకు మద్దతు ఇవ్వాలని జేడీఎస్ అధినేత హెచ్డీ దేవేగౌడ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహా పలువురు సీఎంలకు ఫోన్ చేసిన విషయం తెలిసిందే. స్వయంగా దేవేగౌడ ఫోన్ చేశారని తెలుస్తోంది.
దీంతో ఈ వ్యవహారంలో ఎలా మాట్లాడాలనే విషయమై చంద్రబాబు, టీడీపీ తర్జన భర్డన పడుతోందని తెలుస్తోంది. అసలు కర్ణాటక పరిణామాలపై మాట్లాడటం అవసరమా, మాట్లాడితే ఏమవుతుంది, మాట్లాడకుంటే ఏం జరుగుతుందనే చర్చ టీడీపీలో జరుగుతోందని తెలుస్తోంది.

జాతీయస్థాయిలో చర్చ, బాబు మాట్లాడాలని మంత్రులు
ఈ అంశం జాతీయస్థాయిలో చర్చ అయిందని, కాబట్టి మాట్లాడితేనే బాగుంటుందని కొందరు మంత్రులు చంద్రబాబుకు సూచించినట్లుగా తెలుస్తోంది. అయితే, చంద్రబాబు ఇప్పటికీ ఓ నిర్ణయానికి రాలేదని తెలుస్తోంది. కర్ణాటక గురించి అడిగితే స్వయంగా టీడీపీ కూడా ఇరుకున పడే అవకాశాలున్నాయి. అందుకే టీడీపీ తర్జన భర్జన పడుతోందని తెలుస్తోంది.

వైసీపీ నేతల అంశం ప్రశ్నించే అవకాశం
కర్ణాటకలోని పరిణామాల గురించి ప్రస్తావిస్తే బీజేపీ, వైయస్సార్ కాంగ్రెస్, ఇతర పార్టీ నేతలు.. ఏపీ రాజకీయాల్లో గత నాలుగేళ్లుగా చోటు చేసుకున్న పరిణామాలతో పాటు చంద్రబాబు పాత అంశాలను తవ్వుతారని అంటున్నారు. వైసీపీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలు, పలువురు ఎంపీలు టీడీపీలో చేరారు.

చంద్రబాబు నాయుడు
కానీ, వీరి విషయంలో ఇప్పటి వరకు నిర్ణయం తీసుకోలేదు. అంతేకాదు, నలుగురికి అయితే తన కేబినెట్లో చోటు కూడా కల్పించారు. వారితో రాజీనామా చేయించాలని వైసీపీ పదేపదే డిమాండ్ చేస్తోంది. కానీ ఆ ఎమ్మెల్యేలు లేదా ఎంపీలపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇలాంటి టీడీపీకి మాట్లాడే నైతిక హక్కు ఎక్కడిది అని బీజేపీ నేతలు ప్రశ్నించే అవకాశముంది.

ఇప్పటికే పాత వాటిని తవ్విని సోము వీర్రాజు
ఇప్పటికే సోము వీర్రాజు గురువారం మధ్యాహ్నం ప్రెస్ మీట్ పెట్టి మరీ చంద్రబాబును కడిగి పారేశారు. ఆయనలో కాంగ్రెస్ పార్టీ రక్తం ఉందని, అందుకే ఎన్టీఆర్, వాజపేయిలను కూల్చేశారని మండిపడ్డారు. ఇప్పుడు కర్ణాటకలోను బీజేపీ ఓడిపోవాలని పిలుపునిచ్చారన్నారు.












Click it and Unblock the Notifications