ముద్రగడను ఒంటరిని చేయాలి: తుని ఘటనపై జగనే టార్గెట్
అమరావతి: కాపు ఐక్య గర్జన హింసాత్మకంగా మారిన నేపథ్యంలో ఈ ఘటనకు మీరు బాధ్యులంటే మీరు బాధ్యులంటూ ప్రతిపక్ష విపక్షాల మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఈ క్రమంలో తుని ఘటనపై ప్రతిపక్ష నేత వైయస్ జగన్ని టార్గెట్ చేయాలని, మూకుమ్మడిగా ఎదురుదాడికి దిగాలని సీఎం చంద్రబాబు మంత్రులు, ఎమ్మెల్యేలకు ఆదేశించినట్లు సమాచారం.
కాపు ఐక్య గర్జన హింసాత్మకంగా మారడానికి వైయస్ జగనే కారణమని, ఆయనే తన రౌడీలతో ఈ పరిస్థితిని సృష్టించాడని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారని తెలుస్తోంది. దీంతో పాటు కాపు నాయకులు, పెద్దలతో మాట్లాడి ప్రభుత్వం వారికి అనుకూలంగా ఉన్నట్లు చెప్పి నమ్మించాలని సూచించినట్లు సమాచారం.
కాపుల్లో బీసీల్లో చేర్చడం అనేది రాజ్యాంగ బద్దంగా జరగాలని, అయినప్పటికీ ఎన్నికల్లో చంద్రబాబు అమలు కానీ హామీలను ఇచ్చారంటూ ప్రతిపక్ష నేతలు ధ్వజమెత్తారు. కాపులను ఓటు బ్యాంకుగా పరిగణించి వారిని ఉపయోగించుకుని ఆ తర్వాత వదిలేశారని అంటున్నారు.
అంతేకాదు కాపు ఐక్య గర్జన అధ్యక్షుడు ముద్రగడ పద్మనాభం కూడా టీడీపీ నేతలే తుని ఘటనకు బాధ్యులని చెప్పడంతో ఎలాగైనా సరే వాటిని తిప్పికొట్టాలనే దానిపై సోమవారమంతా చంద్రబాబు తన క్యాంపు కార్యాలయంలో సమాలోచనలు జరిపారు.
అధికారిక కార్యక్రమాలన్నింటినీ రద్దుచేసుకున్న ఆయన సోమవారం ఉదయం నుంచి పలువురు కాపు ప్రజా ప్రతినిధులు, నేతలతో మాట్లాడి మధ్యాహ్నం మంత్రులు, ముఖ్యనేతలతో సమావేశమయ్యారు. కాపు గర్జన తర్వాత పరిణామాలు, అక్కడ పరిస్థితి, దాని ప్రభావం జిల్లాల్లో ఎలా ఉందనే అంశాలపై చర్చించారు.
అంతకముందు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశమైన ముఖ్యమంత్రి, ముందుగా వైయస్ జగన్పై విమర్శల దాడిని పెంచాలని సూచించారని తెలుస్తోంది. పులివెందుల రౌడీలే తునికి వచ్చి ఇదంతా చేసినట్లు జనంలోకి తీసుకెళ్లాలని సూచించారని తెలుస్తోంది.
ప్రతిపక్ష నేత వైయస్ జగన్, ముద్రగడ కలసి ఇదంతా చేస్తున్నారనే వాదనను జనంలోకి తీసుకెళ్లాలని సూచించారు. ముద్రగడను ఒంటరిని చేసి కాపు నాయకులతో ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడించాలని, అలా ఎవరు ఉన్నారో గుర్తించాలని చెప్పినట్లు సమాచారం.
ఆయన నిరవధిక దీక్ష ప్రారంభించే లోపు ఉద్యమాన్ని పక్కదారి పట్టించాలని నేతలను ఆదేశించారని తెలుస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనలతో మంత్రులు, కాపు నేతలు క్యాంపు కార్యాలయంలోని మీడియా పాయింట్ వద్ద సోమవారం ప్రతిపక్ష నేత వైయస్ జగన్పై విమర్శలు కురిపించిన సంగతి తెలిసిందే.