సుజనా! ఇలాగేనా?: ఎంపీల డుమ్మాపై బాబు ఆగ్రహం, ‘కేంద్రంపై పోరాటం’
అమరావతి: కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై పార్లమెంటు వేదికగా నిరసన తెలపాలని నిర్ణయించినా.. పలువురు ఎంపీలు డుమ్మా కొట్టడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు. పార్లమెంటులో తొలి రోజు ఎంపీలు తగిన విధంగా స్పందించకపోవడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు.
Recommended Video
మోడీ ఫోన్ చేశారా? ఇదీ జగన్ పరిస్థితి, విజయసాయితో 'పీఎంఓ'కే కళంకం: బాబు తీవ్ర వ్యాఖ్యలు
సోమవారం పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమంలో ఏడుగురు ఎంపీలే పాల్గొన్నారని, మిగతావారంతా ఏమయ్యారని చంద్రబాబు మండిపడ్డారు.
సుజనా తీరుపై బాబు అసహనం
అంతేగాక, ఆదివారం పార్లమెంటరీ పార్టీ సమావేశం ముగిసిన తర్వాత కేంద్ర మంత్రి సుజనా చౌదరి మీడియాతో మాట్లాడుతూ.. ఇది రొటీన్ సమావేశమే అన్నట్టుగా మాట్లాడటంపైనా ముఖ్యమంత్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. ఒకపక్క ప్రజలు ఆగ్రహంగా ఉన్నాని, రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై మన పోరాట విధానం ఎలా ఉండాలో నిర్ణయించుకోడానికి పెట్టిన సమావేశమని అన్నారు. ఎంతో సీరియస్ సమావేశాన్ని, రొటీన్ అని చెప్పడమేంటి? ప్రజలేమనుకుంటారు?' అని చంద్రబాబు సీరియస్ అయ్యారు.
కేంద్రం వైఖరిని బట్టే మన నిర్ణయం
మంగళవారం ఉదయం ఉండవల్లిలో ముఖ్యమంత్రి అధ్యక్షతన పార్టీ సమన్వయ సమావేశం జరిగింది. మంత్రులు కళావెంకట్రావ్, యనమల రామకృష్ణుడు, పి నారాయణ, కాలవ శ్రీనివాసులుతో పాటు, పార్టీ ప్రధాన కార్యదర్శులు, పార్టీ కార్యాలయ వ్యవహారాలు చూసే నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ డిమాండ్లపై కేంద్ర ప్రభుత్వం నుంచి సానుకూల సంకేతాలేమైనా ఇస్తే... పార్లమెంటులో పోరాటం కొనసాగించాలా? వద్దా? అనేది నిర్ణయిద్దామని చంద్రబాబు అన్నారు. కాగా, ఒకవేళ కేంద్రం సానుకూలంగా స్పందించి, స్పష్టమైన హామీ ఇచ్చినట్లైతే పోరాటానికి కొంత విరామం ఇవ్వాలన్న అభిప్రాయంసమావేశంలో వ్యక్తమైంది.
బాబుకు సుజనా ఫోన్
కాగా, మంగళవారం ఉదయం సుజనా చౌదరిని ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ, లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ చర్చలకు పిలిచినా ఆయన వెళ్లలేదని, వెళ్లకపోవడమే మంచిదనే అభిప్రాయం సమావేశంలో వ్యక్తమైంది. ప్రధాని నరేంద్ర మోడీతో తన చర్చల సారాంశాన్ని సమావేశం జరుగుతున్నప్పుడే సుజనా చౌదరి ఫోన్లో ముఖ్యమంత్రికి వివరించారు.
కేంద్రంపై బాబు అసంతృప్తి
అన్నింటికీ ఇప్పటికీ చూస్తాం, చేస్తామని అంటున్నారే తప్ప... నిర్దిష్టమైన హామీ ఇవ్వడం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అసంతృప్తి వ్యక్తంచేశారు. ప్రత్యేక హోదా కలిగిన ఈశాన్య రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఏ ప్రాతిపదికన రాయితీలు, నిధులు, ప్రాజెక్టులు ఇస్తోందో, ఆంధ్రప్రదేశ్కూ అదే తరహాలో ఇచ్చేలా పట్టుబట్టాలని సమావేశంలో నిర్ణయించారు.
అధికారులు, నాయకులపై ఆగ్రహం
ఈ సమావేశం ఆరంభంలోనే అధికారులు, నాయకులపై ముఖ్యమంత్రి మండిపడ్డారు. శ్రీకాకుళంలో మత్స్యకారుల నిరసన శిబిరాలపై గిరిజనులు దాడిచేసి టెంట్లు తగలబెట్టిన ఘటనను ముందే ఎందుకు పసిగట్టలేకపోయారని, నిఘా విభాగం ఏం చేస్తోందని ఆయన ప్రశ్నించారు. మీరేం చేస్తున్నారంటూ ఆ జిల్లా పార్టీ వ్యవహారాల ఇంఛార్జిగా ఉన్న కొత్తపల్లి సుబ్బారాయుడిని ప్రశ్నించారు.
నేతలకు బాబు దిశానిర్దేశం
టీడీపీ ప్రధాన కార్యదర్శులుగా ఉన్న ఆనం వివేకానందరెడ్డి, కొత్తపల్లి సుబ్బారాయుడు, పయ్యావుల కేశవ్, జయనాగేశ్వర్రెడ్డి, పల్లా శ్రీనివాస్, వర్ల రామయ్యలకు చంంద్రబాబు స్పష్టమైన బాధ్యతలు నిర్దేశించారు. వారికి కేటాయించిన జిల్లాల పరిధిలోని ప్రతి నియోజకవర్గానికి వెళ్లాలని, స్థానిక రాజకీయ పరిస్థితులపైనా, పార్టీ నాయకుల మధ్య ఉన్న విభేదాలుంటే వాటిపైనా నివేదిక రూపొందించాలని సూచించారు. రాష్ట్రంలో ఏ, బీ, సీ కేటగిరీల్లో ఉన్న నియోజకవర్గాల వివరాలను అందజేస్తామని, బీ, సీ కేటగిరీలో ఉన్న నియోజకవర్గాలపై ఎక్కువ దృష్టి పెట్టాలని దిశానిర్దేశం చేశారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా పార్టీ నేతలంతా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.